Karthika Monday: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు


Karthika Monday: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
కార్తీక మాసం సోమవారం కావడంతో శైవక్షేత్రాలు శివనాస్మరణతో మార్మోగుతున్నాయి.
కోటప్పకోండకు పోటెత్తిన భక్తుల రద్దీ
కార్తీక మాసం సోమవారం కావడంతో శైవక్షేత్రాలు శివనాస్మరణతో మార్మోగుతున్నాయి. గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే ఆలయ ప్రాంగణంలో దీపారాణ చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మరో వైపు అమరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమీపంలోనే కృష్ణానదిలో స్నానమాచరించిన భక్తులు శివోహం శివోహం అంటూ పూజలు చేస్తున్నారు.
శ్రీశైలం మల్లికార్జుని దర్శనానికి నాలుగు గంటల సమయం
కార్తీక సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తెల్లవారు జాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శానికి భారీగా తరలివచ్చారు. స్వామి అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల పాటు పడుతుంది. భకక్తులు ఆలయంలో కార్తీక నోములు నోచుకుంటున్నారు. భక్తులు రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని, ఆది, సోమవారాల్లో స్పర్ష దర్శనం, సామూహిక, గర్బాలయ అభిషేకాలు నిలిపి వేశారు. మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు మూడు విడతలుగా స్పర్ష దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. మొదటి కార్తీక సోమవారం పురస్కరించికొని ఆలయ ప్రధానాలయం ఈశాన్య భాగంలోని ఆలయ పుష్కరిణి దగ్గర సాయంత్రం దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో ద్రాక్షారామ మాణక్యాంబ సమేత భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భీమేశ్వర స్వామివారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ, ధర్మాధాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు...
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కార్తీక శోభ
కార్తీక సోవవారం కావటంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మ ముహూర్తంలో శివుడికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్రేక పూజలు నిర్వహించారు. దీంతో శివనామ స్మరణతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి.
సూర్యాపేట జిల్లా పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ఈరోజు కార్తీక మాసం తొలి సోమవారం కావటంతో సూర్యాపేట జిల్లాలోని అయ్యప్ప స్వామి దేవాలయం, అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
వేములవాడ సన్నిధిలో..
కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో సందడిగా మారింది. తొలి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు తరలివెల్లారు. తెల్లవారుజామునే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు .ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



