వైష్ణోదేవి ఆలయం – జమ్మూకశ్మీర్

త్రికూట పర్వతాల్లో కొలువైన వైష్ణోదేవి అమ్మవారిని మాతా రాణి, వైష్ణవి వంటి పేర్లతో భక్తులు పిలుస్తారు. పవిత్ర గుహలో మూడు సహజ శిలా రూపాల్లో అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఆలయానికి చేరుకోవడానికి భక్తులు సుమారు 12 కిలోమీటర్ల కొండ మార్గంలో ప్రయాణిస్తారు. ఈ యాత్ర భక్తి, ఓర్పుకు ప్రతీకగా నిలుస్తుంది.
కామాఖ్య ఆలయం – అసోం
గువాహటిలోని నీలాచల కొండపై ఉన్న కామాఖ్య ఆలయం ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారిని యోని ఆకారంలోని పవిత్ర శిలారూపంలో పూజిస్తారు. స్త్రీ శక్తి, సంతానోత్పత్తి భావనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న ఈ క్షేత్రంలో జరిగే అంబుబాచి మేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.
దక్షిణేశ్వర్ కాళీ ఆలయం – పశ్చిమ బెంగాల్
కోల్‌కతా సమీపంలోని హూగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం 19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించారు. భవతారిణి కాళీదేవికి అంకితమైన ఈ క్షేత్రానికి శ్రీరామకృష్ణ పరమహంసతో ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
అంబాజీ ఆలయం – గుజరాత్
గుజరాత్–రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అంబాజీ ఆలయం ప్రముఖ శక్తి క్షేత్రం. ఇక్కడ సాధారణ విగ్రహానికి బదులుగా పవిత్ర శ్రీయంత్రాన్ని పూజిస్తారు. భాద్రపద పౌర్ణమి వేడుకల సమయంలో వేలాది మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుంటారు.
చాముండేశ్వరి ఆలయం – కర్ణాటక
మైసూరు చాముండి కొండపై వెలసిన చాముండేశ్వరి దేవి మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి రూపంగా పూజలందుకుంటుంది. సుమారు వెయ్యి మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మైసూరు దసరా వేడుకల్లో ఈ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది.
కనకదుర్గ ఆలయం – ఆంధ్రప్రదేశ్
విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కృష్ణానది ఒడ్డున కొలువైన కనకదుర్గమ్మ దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రాల్లో ఒకటి. మహిషాసురుడిపై నిలబడి ఉన్న అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నవరాత్రుల్లో ఆలయం ప్రత్యేక పూజలతో సందడిగా మారుతుంది.
భ్రమరాంబ మల్లికార్జున ఆలయం – ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలోని ఈ ప్రసిద్ధ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. శివ–శక్తి ఆరాధనకు ప్రతీకగా ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది.
బనశంకరి ఆలయం – కర్ణాటక
బాదామిలోని బనశంకరి అమ్మవారి ఆలయం శాకంబరి దేవి రూపానికి అంకితం. చెడును తొలగించి భక్తులను కాపాడే తల్లిగా అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ రాహుకాల పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటం ఈ ఆలయ విశిష్టతల్లో ఒకటి.
దుర్గాదేవి ఆలయం – వారాణసి
వారాణసిలోని దుర్గాకుండ్ సమీపంలో ఉన్న దుర్గాకుండ్ మందిరం ఎరుపు రంగు నిర్మాణంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం స్వయంభువుగా వెలసిందనే విశ్వాసం ఉంది. నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, వేడుకలు జరుగుతాయి.
నైనా దేవి ఆలయం, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో నైని సరస్సు ఉత్తర తీరాన నైనా కొండపై నైనా దేవి ఆలయం కొలువై ఉంది. ఇక్కడి ప్రధాన దేవతను రెండు నేత్రాల రూపంలో నైనా దేవిగా ఆరాధిస్తారు. నైనిటాల్‌ను ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటిగా భావిస్తారు. సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు సంచరిస్తున్న సమయంలో ఆమె నేత్రాలు పడిన ప్రదేశమే ఈ క్షేత్రమని భక్తుల విశ్వాసం. ఆలయ గర్భగుడిలో కాళీదేవి, నైనా దేవి, గణేశుడు కొలువై ఉంటారు. భాద్రపద శుక్ల అష్టమి రోజున మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో జరిగే ఉత్సవాల తరహాలో ఇక్కడ కూడా విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు.