అక్షర్ ధామ్, ఢిల్లీ

మహర్షి వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం రాజస్థానీ పింక్ శాండ్‌స్టోన్, ఇటాలియన్ మార్బుల్‌తో దీనిని నిర్మించారు. ఇనుము, రాగి వంటి లోహాలు ఏవీ వాడకుండా పూర్తిగా రాతితోనే రూపుదిద్దుకుంది. 10 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ మందిరంలో 234 శిల్పకళా శోభిత స్తంభాలు, 9 గోపురాలు, 20,000 కంటే ఎక్కువ సాధువుల, భక్తుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే 134 నిలువెత్తు ఏనుగుల విగ్రహాలు మలచబడ్డాయి. స్వామినారాయణ్‌కు అంకితం చేసిన ఈ ఆలయంలో ఆయన 11 అడుగుల మూర్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణుల పంచలోహ విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి.
మీనాక్షి అమ్మవారి ఆలయం, మదురై
ద్రవిడ శైలిలో 14 ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం మదురై నగర మధ్యలో ఉంది. పైనుంచి చూసినప్పుడు ఈ నిర్మాణం ఒక 'మండల' ఆకారంలో కనిపిస్తుంది. ప్రధాన దైవాలైన సుందరేశ్వరుడు, మీనాక్షి అమ్మవారితో పాటు వినాయకుడు, మురుగన్, లక్ష్మి, రుక్మిణి, సరస్వతి దేవుళ్ల ఉపాలయాలు ఉన్నాయి.
సోమనాథ్ ఆలయం, సౌరాష్ట్ర
అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ ప్రాచీన ఆలయం చాళుక్య శైలిలో, గుజరాత్ సోమ్‌పురా శిల్పుల నైపుణ్యంతో నిర్మించబడింది. 15 మీటర్ల ఎత్తుతో ఏడు అంతస్తుల నిర్మితమై, పైన 8.2 మీటర్ల ధ్వజస్తంభం కలిగి ఉంది. ఈ తీరం నుంచి అంటార్కిటికా వరకు మధ్యలో ఎలాంటి భూభాగం లేకపోవడం దీని ప్రత్యేకత.
రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం
ద్రవిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిడార్ ఉంది. 4,000 అడుగుల పొడవునా 4,000 కంటే ఎక్కువ స్తంభాలు కలిగి ఉంది. 21 గోపురాలు, 'వేయి స్తంభాల మండపం', వినూత్న శిల్పకళతో కూడిన 'శేష మండపం' ప్రధాన ఆకర్షణలు.
జగన్నాథ ఆలయం, పూరీ
ఒరిస్సా శిల్పకళా శైలిలో 4,00,000 చదరపు అడుగుల వైశాల్యంలో విస్తరించిన ఈ కాంప్లెక్స్‌లో 120 ఉపాలయాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం ముందు 16 కోణాలు కలిగిన ఏకశిలా స్తంభం (అరుణ స్తంభం), కాపలాగా ఉన్నట్లు ఉండే రెండు భారీ సింహాల విగ్రహాలు ఉంటాయి.
విరూపాక్ష ఆలయం, హంపి
విజయనగర సామ్రాజ్య శైలి శిల్పాలు, గోడ చిత్రాలతో కూడిన ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించగా, 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పునర్నిర్మించారు. 9 అంతస్తుల రాజగోపురం, విశాలమైన మండపాలు ఉన్నాయి. ఇక్కడి చిత్రాలు రామాయణ, మహాభారత ఘట్టాలను ఆవిష్కరిస్తాయి.
శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం
ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయాలలో ఒకటిగా భావించే ఈ కాంప్లెక్స్ 156 ఎకరాలలో (6,31,000 చ.మీ.) విస్తరించి ఉంది. 21 అద్భుతమైన గోపురాలు, 32,592 అడుగుల పొడవైన ఏడు ప్రహరీగోడలు ఈ ఆలయ ప్రాకారాలుగా ఉన్నాయి.
గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్
శ్రీ హర్మందిర్ సాహిబ్ అని పిలిచే ఈ సిక్కు పుణ్యక్షేత్రం అమృత సరోవరం మధ్యలో 67 చదరపు అడుగుల ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. నలువైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి. దీని ప్రవేశ ద్వారం ప్రసిద్ధ చెక్కడాలతో ఉండి, గురు గ్రంథ్ సాహిబ్ వచనాలు చెక్కబడి ఉంటాయి. ఆలయ వెలుపలి భాగం బంగారంతో తాపడం చేయబడింది.
లోటస్ టెంపుల్, ఢిల్లీ
బహాయ్ విశ్వాసాల ప్రకారం నిర్మించిన ఈ కమలాకార దేవాలయం 40 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉంది. 9 చెరువుల నడుమ 27 తెల్లటి మార్బుల్ రేకులు తామరపువ్వు ఆకారంలో అమర్చబడి ఉంటాయి. భవనానికి గాలి, వెలుతురు అందించేలా ఈ పుష్కరిణులు డిజైన్ చేయబడ్డాయి.
కైలాస నాథ ఆలయం, ఎల్లోరా
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఒక కొండను పైనుంచి కిందికి తొలిచి, 4,00,000 టన్నుల రాతిని తొలగించి దీనిని మలచడం గమనార్హం. 60 అడుగుల (18.29 మీటర్లు) ఎత్తు, 200 అడుగుల (60.69 మీటర్లు) వెడల్పుతో 03 అంతస్తులలో 'U' ఆకారంలో ఈ అద్భుత నిర్మాణం ఉంటుంది.