Gold Prices Today : పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు

Gold Prices Today : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ మేఘాల మధ్య పసిడి రికార్డు స్థాయికి చేరింది.

CR Reddy
Published on: 26 May 2026 7:52 AM IST
Gold Prices Today
X

Gold Prices Today

Gold Prices Today : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నా బంగారం, వెండి ధరలు మాత్రం జెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత, నేడు మార్కెట్‌లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు (మంగళవారం) ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. నిన్నటి ముగింపు ధరల వద్దే ట్రేడింగ్ జరుగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,390 వద్ద ఉంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ.1,46,110 గా ఉండగా, 18 క్యారెట్ల పసిడి రూ.1,19,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఒకప్పుడు తులం బంగారం అంటే వేలల్లో ఉండేది, కానీ నేడు లక్షన్నర దాటిపోవడం కొనుగోలుదారులను విస్మయానికి గురిచేస్తోంది.

వెండి ధరలు కూడా పైపైకే

బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా సామాన్యులకు షాక్ ఇస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర దాదాపు మూడు లక్షల రూపాయల మార్కుకు చేరువలో ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.29,490 పలుకుతుండగా, కేజీ వెండి ధర రూ.2,94,900 వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా వెండిని పేదల బంగారం అంటారు, కానీ ప్రస్తుత ధరలు చూస్తుంటే వెండి కొనడం కూడా కష్టతరంగానే కనిపిస్తోంది. నేడు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాల బట్టి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి.

దేశంలోని ఇతర నగరాల్లో పరిస్థితి

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల వల్ల స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,390 వద్దే ఉంది. అయితే ఢిల్లీ, సూరత్ వంటి నగరాల్లో కొద్దిగా ఎక్కువగా రూ.1,59,440 వద్ద విక్రయించబడుతోంది. ఇక దక్షిణాన చెన్నై, మధురై, కోయంబత్తూరు వంటి నగరాల్లో పసిడి ధర రికార్డు స్థాయిలో రూ.1,61,250 వద్ద కొనసాగుతోంది.

కొనుగోలుదారులకు సూచన

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, యుద్ధ పరిస్థితులు బంగారం రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ధరలు స్థిరంగా ఉన్నాయని ఇప్పుడే కొనుగోలు చేయాలా? లేక తగ్గే వరకు వేచి చూడాలా? అన్నది వినియోగదారుల వ్యక్తిగత నిర్ణయం. అయితే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, కొనుగోలు చేసే ముందు ఒకసారి మీ సమీపంలోని జ్యువెలరీ షాపులో లేదా నమ్మదగిన వెబ్‌సైట్లలో రేట్లను సరిచూసుకోవడం మంచిది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story