Russia Flight Accident: బండరాయిని ఢీ కొట్టిన విమానం.. 29 మంది మృతి!

Russia Flight Accident: రష్యాలో ఒక విమానం బండరాయిని ఢీ కొట్టింది. దీంతో విమానంలోని 29 మంది మరణించారు.

KVD Varma
Updated on: 1 April 2026 10:19 AM IST
Russia Flight Accident: రష్యాలో ఒక విమానం బండరాయిని ఢీ కొట్టింది
X

Russia Flight Accident

Russia Flight Accident: క్రిమియాలో కూలిపోయింది. విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది అందరూ అక్కడికక్కడే మరణించారు. రష్యా వార్తా సంస్థ టాస్ ప్రకారం, విమానం మొదట కంట్రోల్ రూమ్ తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత ఒక బండరాయిని ఢీకొట్టింది. ఆ ప్రాంతం మీదుగా షెడ్యూల్డ్ విమానయానం నిర్వహిస్తున్న సమయంలో, మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సుమారు 18:00 గంటలకు విమానంతో సంబంధాలు తెగిపోయాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆ తరువాత జరిపిన గాలింపుల్లో విమానం కొండల ప్రాంతంలో బండరాయిని ఢీ కొట్టి కూలిపోయిందని తెలిసింది. ఈ ప్రమాదానికి ఎటువంటి విద్రోహ చర్య కారణం కాదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ అన్నికోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందని ప్రకటించింది.

ప్రాథమిక విచారణల ప్రకారం, ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని తెలుస్తోంది. ఇది ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఏఎన్-26 అనేది ఆంటోనోవ్ కంపెనీ తయారు చేసిన విమానం. ఇది సోవియట్ కాలం నాటి సైనిక రవాణా విమానం. తొలిసారిగా ఈ విమానం 1969లో ఆకాశంలోకి ఎగిరింది.

దీనిని దళాలను, ఆయుధాలను, సైనిక సామగ్రిని రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒకేసారి డజన్ల కొద్దీ సైనికులను లేదా భారీ సరుకును తీసుకువెళుతుంది.

ఈ విమానానికి చాలా ప్రత్యేక సామర్ధ్యం ఉంది. ఇది చిన్న, సరిగా నిర్వహణలేని రన్‌వేల నుండి కూడా టేకాఫ్ అవ్వగలదు. అందువల్ల ఇది క్లిష్టమైన ప్రదేశాల్లో, యుద్ధ ప్రాంతాలలో ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. దీని వెనుక ఉన్న పెద్ద కార్గో డోర్, గాలిలో నుండి వస్తువులను జారవిడిచే కార్యకలాపాలకు కూడా వీలు కల్పిస్తుంది.

దీని 50 ఏళ్లకు పైగా పాత డిజైన్ భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ వినయంలో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ విమానం ఇప్పటికీ అనేక దేశాలలో వాడుకలో ఉంది. కానీ, క్రమంగా దీని స్థానంలో ఆధునిక రవాణా విమానాలను ఉపయోగిస్తున్నారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story