IPL 2026 Match 5: ఢిల్లీతో పోరుకు సిద్ధమైన లక్నో.. ఈరోజు గెలుపెవరిదో?

IPL 2026 Match 5: ఐపీఎల్ 2926లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు లక్నోలో మ్యాచ్ జరుగుతుంది.

KVD Varma
Published on: 1 April 2026 12:34 PM IST
IPL 2026 Match 5: ఐపీఎల్ 2926లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్
X

IPL 2026 Match 5

IPL 2026 Match 5: ఐపీఎల్‌ 2026లో భాగంగా ఈరోజు జరిగే ఐదవ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా స్టేడియంలో జరగనుంది. సాయంత్రం మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు టైటిల్ గెలవలేదు. 2022 నుండి ఈ లీగ్‌లో ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్‌లో 7వ స్థానంలో నిలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ దే స్వల్ప ఆధిక్యం..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో, ఢిల్లీ జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు గెలవగా, లక్నో మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఐపీఎల్ 2025లో ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా, రెండుసార్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. లక్నోలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా, డీసీ రెండుసార్లు, ఎల్‌ఎస్‌జీ ఒకసారి గెలుపొందాయి.

డకెట్ టోర్నమెంట్ నుంచి ఔట్..

ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ టోర్నమెంట్ నుంచి వైదొలిగినట్లు ఢిల్లీ క్లబ్ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో, కేఎల్ రాహుల్‌తో కలిసి కరుణ్ నాయర్ లేదా పతుమ్ నిస్సంక ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం పేసర్ మిచెల్ స్టార్క్ తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడు. అతను ఏప్రిల్ రెండో వారంలో జట్టులో చేరే అవకాశం ఉంది.

మిల్లర్ ఢిల్లీ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తాడు..

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. రాహుల్‌తో పాటు, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ నుంచి కూడా జట్టు బలమైన ప్రదర్శనలను ఆశిస్తోంది. మిల్లర్ రాకతో జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలపడింది. సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ ఫినిషర్లుగా ఉన్నారు. మరోవైపు, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్ బ్యాట్, బాల్ రెండింటితోనూ టీమ్ కు సహకరిస్తారు.

లక్నోకు పంత్ ఫామ్ కీలకం

లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ఆర్డర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్‌లు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తారని ఆశిస్తున్నారు. నికోలస్ పూరన్ ఒంటరిగా ఏ మ్యాచ్ ఫలితాన్నైనా మార్చగలడు. అయితే, లక్నో జట్టుకు కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ కీలకం కానుంది. లక్నో మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మహమ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, ఆన్రిచ్ నోర్ట్జా, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్‌ల రూపంలో లక్నో జట్టులో బలమైన పేస్ బౌలింగ్ దళం ఉంది. స్పిన్ విభాగానికి దిగ్వేష్ రాఠీ నాయకత్వం వహిస్తాడు.

రెండు జట్ల టీమ్ 12 (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (WK), కరుణ్ నాయర్/పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, విపరాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, అకిబ్ నబీ, తంగరాసు నటరాజన్.

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్-కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, దిగ్వేష్ రాఠీ, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

పిచ్ ఎలా ఉండొచ్చంటే..

లక్నో స్టేడియంలోని పిచ్ కొన్నిసార్లు తక్కువ స్కోరు నమోదయ్యే మ్యాచ్‌లకు, మరికొన్నిసార్లు ఎక్కువ స్కోరు నమోదయ్యే మ్యాచ్‌లకు వేదికైంది. ఇక్కడ మంచు కూడా ఒక ముఖ్యమైన అంశం. మంచు కారణంగా, రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు బంతిని సరిగ్గా పట్టుకోవడంలో ఇబ్బంది పడతారు, ఇది బ్యాటింగ్ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల, టాస్ కీలకం అవుతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

లక్నో స్టేడియం ఇప్పటివరకు 22 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో గెలుపొందగా, ఛేజింగ్ చేసిన జట్టు 12 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

వాతావరణం..

లక్నోలో ఈరోజు జరిగే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 1% ఉంది. అయితే, ఈ సమయంలో వాతావరణం అత్యంత వేడిగా కూడా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి ఇక్కడ తేలికపాటి వర్షం కురిసినప్పటికీ, దాని ప్రభావం మ్యాచ్‌పై పెద్దగా ఉండే అవకాశం లేదు. గతంలో, డిసెంబర్ 17న, పొగమంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దయింది.

ఐపీఎల్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story