Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడు!

Prabhsimran Singh: పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు.

Rishvik
Published on: 24 May 2026 6:26 PM IST
Prabhsimran Singh
X

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడు!

Prabhsimran Singh: పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో రెండు వేర్వేరు సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదడంతో ప్రభ్‌సిమ్రన్ ఈ ఘనతను సాధించాడు.

లక్నో సూపర్ జెయింట్స్‌పై ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టుకు మెరుగైన ఆరంభం అందించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ప్రభ్‌సిమ్రన్ మరోసారి 500 పరుగుల మార్క్‌ను దాటాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ 549 పరుగులు చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026లో కూడా 500కు పైగా పరుగులు సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ అన్‌క్యాప్డ్ భారత ఆటగాడు రెండు సీజన్లలో ఈ ఘనత సాధించలేదు. ప్రభ్‌సిమ్రన్ మెరుపు ఆరంభాల కారణంగానే ఈ సీజన్లో పీబీకేఎస్ మొదటి దశలో వరుస విజయాలు అందుకుంది.

మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్ సమష్టి ప్రదర్శనతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేసి ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రభ్‌సిమ్రన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేర్చాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పట్టికలో 15 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది.

అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 72 పరుగులతో రాణించగా.. అబ్దుల్ సమద్ 37 పరుగులు చేశాడు. అర్షిన్ కులకర్ణి (0), నికోలస్ పూరన్ (2), ముకుల్ చౌదరి (1) నిరాశపర్చారు. రిషబ్ పంత్ 22 బంతుల్లో 26 రన్స్ చేశాడు. అయితే పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సెన్ కీలక సమయంలో వికెట్లు తీసి లక్నోను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story