YS Jaganmohan Reddy: ఆస్తుల కేసులో జగన్ విచారణ పూర్తీ… సీబీఐ కీలక సమర్పణలు


YS Jaganmohan Reddy: ఆస్తుల కేసులో జగన్ విచారణ పూర్తీ… సీబీఐ కీలక సమర్పణలు
నాంపల్లి సీబీఐ కోర్టులో ముగిసిన జగన్ విచారణ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ సీఎం జగన్ అరగంట పాటు కోర్టులో ఉన్న మాజీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,YSRCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దశాబ్ద కాలంగా రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఈ కేసులో సీబీఐ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లు, వివిధ కంపెనీలతో జగన్ ఆర్థిక లావాదేవీలపై ఆరోపణలు, విచారణలో జాప్యం వంటి అంశాలు ఈ కేసును సంక్లిష్టంగా మార్చాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్కు కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకు కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ, జగన్కు చెందిన కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుందని సీబీఐ తన చార్జిషీట్లలో ఆరోపించింది. ఈ లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరిగిందనే అభియోగాలపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు 2011లో సీబీఐ దర్యాప్తుతో చేపట్టింది. జగన్తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సీబీఐ 2013లో చార్జీషీటు దాఖలు చేసింది. తద్వారా జగన్ సుమారు 150కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు పేర్కొంది. రఘురామ్ సిమెంట్స్లో 95కోట్ల విలువైన షేర్లు, 55కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దాల్మియా ఉద్యోగి జయదీప్ బసు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్లో లభించినట్లు పేర్కొంది. అరబిందో, హెటిరో సంస్థలకు క్విడ్ ప్రొకో కింద మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో భూముల కేటాయింపుపై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది.
జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వివిధ కంపెనీలకు అనుకూలంగా భూమి కేటాయింపులు, లీజులు, ఇతర ప్రభుత్వ సహకారం అందించినందుకు బదులుగా జగన్ ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ లావాదేవీల ద్వారా జగన్ యాజమాన్యంలోని సంస్థలైన సాక్షి మీడియా, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ వంటి వాటికి పెట్టుబడుల రూపంలో భారీ మొత్తాలు అందాయని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో దాదాపు 100 మంది సహ నిందితులు ఉన్నారు. వీళ్లలో వివిధ కార్పొరేట్ సంస్థలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారు.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో దాల్మియా సిమెంట్స్ , ఇండియా సిమెంట్స్ , రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి సంస్థలపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయి. దాల్మియా సిమెంట్స్ 95 కోట్ల పెట్టుబడి పెట్టి తద్వారా జగన్ సంస్థలకు 55 కోట్లు హవాలా మార్గంలో చేర్చినట్లు సీబీఐ ఆరోపించింది.
సీబీఐ చార్జ్షీటు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దాల్మియా సిమెంట్స్కు చెందిన 793 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో 377కోట్ల 26లక్షల విలువైన భూములు కూడా ఉన్నాయి. ఈడీ చర్యను సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. కేసును లోతుగా పరిశీలించిన అథారిటీ, ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును ఖరారు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించింది.
వాన్పిక్ ప్రాజెక్టు కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గల్ఫ్ దేశాలకు చెందిన రాస్ అల్ ఖైమా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాయి. ఈ ప్రాజెక్టుకు ఛైర్మన్గా నిమ్మగడ్డ ప్రసాద్ను నియమించారు. ఈ వాన్పిక్ ప్రాజెక్టు కోసం నిబంధనలను ఉల్లంఘించి సుమారు 15 వేల ఎకరాలకు పైగా అక్రమంగా భూములు కేటాయించారని.. దానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారని సీబీఐ అధికారులు ఆరోపించారు.
జగన్ ఆస్తుల కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. వైసీపీ అనుకూల మీడియా ఈ కేసులను కక్షసాధింపుగా అభివర్ణిస్తుంది. అయితే టీడీపీ నాయకులు జగన్పై ఉచ్చు బిగుస్తోందని చెప్తున్నారు. ఈ కేసు దీర్ఘకాలంగా సాగుతోంది. విచారణలు, వాయిదాలు, రాజకీయ ఒత్తిళ్లతో సంక్లిష్టంగా మారింది.
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ సీఎం జగన్ విచారణ ముగిసింది. ఆస్తుల కేసులో దాదాపు 30 నిమిషాల పాటు జగన్ విచారణ జరిగింది. విదేశీ పర్యటనలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో.. జగన్ను వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఇవాళ విచారణకు హాజరయ్యారు జగన్. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు జగన్. ఆరేళ్ల తర్వాత ఆస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. ఇక.. విచారణ అనంతరం నేరుగా లోటస్పాండ్లోని నివాసానికి బయల్దేరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



