Tirumala: తిరుమలలో బోటింగ్ అంశంపై వివాదం.. పాపవినాశనంలో ట్రయల్ రన్..అభ్యంతరం చెబుతోన్న భక్తులు


Tirumala: తిరుమలలో బోటింగ్ అంశంపై వివాదం రాజుకుంది. పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించడంపై పలువురు భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు....
Tirumala: తిరుమలలో బోటింగ్ అంశంపై వివాదం రాజుకుంది. పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ నిర్వహించడంపై పలువురు భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీకి చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సెక్యూరిటీ ఆడిట్లో భాగంగా ప్రయోగాత్మకంగా బోటింగ్ టీమ్ అక్కడ పర్యవేక్షించిందని అటవీశాఖ తిరుపతి పాలనాధికారి డీఎఫ్ఓ వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు. ఇక్కడి నుంచి బాలపల్లె, చిట్వేల్ అటవీ ప్రాంతం వరకు బయోస్పియర్ సరిహద్దులున్నందున రక్షణకు ఈ ప్రదేశం కీలకం అవుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో ఎకోటూరిజం అభివ్రుద్ధికున్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రం పరిధిలో ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేముందు అందరి అభిప్రాయాలను తీసుకుంటామని..అందరికీ సమ్మతితోనే ముందుకు వెళ్తామని చెబుతున్నారు.
ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్బంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని తెలిపారు.
ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire