Shyamala Rao: తిరుమల భద్రతకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ – టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

Shyamala Rao
x

Shyamala Rao: తిరుమల భద్రతకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ – టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

Highlights

Shyamala Rao: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను మరింత బలపరిచే దిశగా టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

Shyamala Rao: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను మరింత బలపరిచే దిశగా టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయ పరిసరాల్లో అనధికారికంగా డ్రోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆధునిక "యాంటీ డ్రోన్ టెక్నాలజీ"ను అమలు చేయాలని నిర్ణయించింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. సమావేశానికి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించగా, అనంతరం ఈవో జె. శ్యామలరావు మీడియాతో వివరాలు పంచుకున్నారు.

భద్రతపై అత్యున్నత ప్రాధాన్యత

డ్రోన్ల వలన భద్రతకు ముప్పు ఉండవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ ఆధునిక యాంటీ డ్రోన్ సాంకేతికతతో పాటు ఇతర పరిష్కారాలను పరిశీలించి, ఉత్తమ పరిజ్ఞానాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు.

పచ్చదనాన్ని పెంపొందించాలనే దిశగా ముందడుగు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, తిరుమల కొండలపై ప్రస్తుతం ఉన్న 68.14% పచ్చదనాన్ని 80%కు పెంచేందుకు అటవీశాఖ సహకారంతో చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం మొదటిదశలో రూ.4 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.

ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

తిరుచానూరు, అమరావతి, నారాయణవనం, కపిలతీర్థం, నాగాలాపురం, ఒంటిమిట్ట వంటి ఆలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ఆర్కిటెక్ట్‌ల నుండి ప్రతిపాదనలు ఆహ్వానించనున్నారు. తుళ్లూరులోని అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.10 కోట్లు కేటాయించనున్నారు.

స్విమ్స్‌కు భారీ నిధుల మంజూరు

స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రస్తుతం ఉన్న రూ.60 కోట్లకు అదనంగా రూ.71 కోట్లు మంజూరు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఖాళీ పోస్టుల భర్తీతో పాటు, నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో "శ్రీవారి వైద్య సేవ" ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

క్యాంటీన్ల నిర్వహణ – భక్తులకు మెరుగైన భోజనం

బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సులపై నిర్ణయం తీసుకుని, నాణ్యమైన ఆహారం అందించే సంస్థలకు అవి అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న సంస్థల పనితీరును సమీక్షించిన తర్వాతే కొనసాగింపు ఇవ్వనున్నారు.

పర్యాటకాభివృద్ధి, అన్నదానం విస్తరణ

ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పర్యావరణ మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు. ఒంటిమిట్టలో అన్నదాన సేవలను మరింత విస్తృతం చేయనున్నారు.

వసతిగృహాల పేర్ల మార్పు

ప్రతిస్పందన లేని దాతల వసతిగృహాల పేర్లను టీటీడీ తనంతట తానే మార్చాలని నిర్ణయించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు మార్పుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఉద్యోగుల బదిలీలు, వీఆర్ఎస్

టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థుల విషయంలో, వారిని ఇతర శాఖలకు బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ ఆఫర్ చేయడం వంటి చర్యలను ఆమోదించారు.

గోవింద నామావళి రీమిక్స్ పై చట్టపరమైన చర్యలు

‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రబృందం గోవింద నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి ఆదేశించింది. టీటీడీ అధికారులు తగిన చర్యలు ప్రారంభించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories