Puttur Tragedy: "నిన్ను ప్రేమించిన పాపానికి ఇదో గుణపాఠం" ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య.. పుత్తూరులో ఘోరం!

Puttur Tragedy
x

Puttur Tragedy: "నిన్ను ప్రేమించిన పాపానికి ఇదో గుణపాఠం" ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య.. పుత్తూరులో ఘోరం!

Highlights

Puttur Tragedy: తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం. భర్త వేధింపులు, అప్పుల బాధ తాళలేక ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య. చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది.

Puttur Tragedy: తిరుపతి జిల్లా పుత్తూరులో శనివారం గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త జులాయిగా తిరుగుతూ, అప్పుల ఊబిలోకి నెట్టడంతో ఓ వివాహిత తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు చిన్నారులకు ఉరేసి ప్రాణాలు తీసిన ఆమె, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఏం జరిగింది?

నేషనూరుకు చెందిన పద్మ (28), శివశంకర్ (32) గతంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించకపోయినా 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి తేజ (6), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, పెళ్లయినప్పటి నుండి శివశంకర్ పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఇంటి బాధ్యతలను విస్మరించాడు.

కలచివేస్తున్న సూసైడ్ నోట్:

చనిపోయే ముందు పద్మ రాసిన లేఖ ఆమె అనుభవించిన నరకాన్ని ప్రతిబింబిస్తోంది.

"తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తలో ఉండకూడదని కోరుకునే ప్రతి చెడ్డ అలవాటు నా భర్తలో ఉంది. నిన్ను ప్రేమించిన పాపానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కనీసం అప్పులు కూడా తీర్చలేనంటున్నావు. నా తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా.. ఈసారైనా సెటిల్ అయ్యాక చేసుకో." అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఘటనకు దారితీసిన పరిస్థితులు:

పద్మ డ్వాక్రా సంఘంలో రుణం తీసుకుని ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు చెల్లిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. శనివారం అప్పు కట్టావా అని భర్తను అడగగా, తనవల్ల కాదని అతను తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ పిల్లలను బెడ్‌రూమ్‌లో ఉరేసి, హాల్‌లో తాను ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టగా ఈ ఘోరం వెలుగుచూసింది.

పోలీసుల చర్యలు: ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories