
శ్రీకాకుళం జిల్లా పలాస చిన్న తిరుపతి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గూగుల్ మ్యాప్స్ సాయంతో రెక్కీ నిర్వహించి రూ. 40 లక్షల సొత్తు దోచుకున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
దొంగలు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒకప్పుడు కేవలం ఇళ్ల తాళాలు పగులగొట్టే దొంగలు, ఇప్పుడు 'హైటెక్' దొంగలుగా మారిపోతున్నారు. గూగుల్ మ్యాప్స్లో ఆలయాలను సెర్చ్ చేయడం, సోషల్ మీడియాలో పాపులర్ అయిన గుళ్లను టార్గెట్ చేయడం వీరి స్టైల్. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో (చిన్న తిరుపతి) జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించడంతో ఈ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
హైటెక్ స్కెచ్.. సోషల్ మీడియానే క్లూ!
ఒరిస్సా రాజకుటుంబీకులు నిర్మించిన పలాస వేంకటేశ్వర స్వామి ఆలయం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ఫేమస్ అయ్యింది. దీనిని ఆసరాగా చేసుకున్న దొంగల ముఠా, ఈ గుడిలో భారీగా సొత్తు ఉంటుందని పక్కాగా ప్లాన్ చేశారు.
రెక్కీ: ఈ నెల 3వ తేదీన గూగుల్ మ్యాప్స్ సాయంతో ఆలయానికి చేరుకుని రెక్కీ నిర్వహించారు.
చోరీ: ఈ నెల 9వ తేదీ రాత్రి ఆలయం ప్రాంగణంలోని మెస్ను తొలగించి, గర్భగుడి తాళాలు బద్దలు కొట్టారు.
సొత్తు: స్వామివారి బంగారు నామాలు, వెండి కవచం, పాదాలు, హుండీ నగదు కలిపి మొత్తం రూ. 40.25 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు.
జైలులో దోస్తీ.. బయట చోరీ!
ఈ కేసులో పట్టుబడ్డ ఐదుగురు నిందితులు పక్కా క్రిమినల్స్. వీరి వెనుక ఉన్న చరిత్ర చూస్తే పోలీసులు సైతం షాక్ అయ్యారు.
ముఠా సభ్యులు: కె. శ్రీనివాసరావు (A1-ప్రధాన నిందితుడు), ఎస్. భోగేష్, ఎస్. సుదర్శన్ రావు, పి. చక్రధర్, దార రమేష్.
నేర చరిత్ర: ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుపై ఇదివరకే 38 చోరీ కేసులు ఉన్నాయి. మిగిలిన వారిపై కూడా పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి.
లింక్: వీరంతా గతంలో జైలులో ఉన్నప్పుడు స్నేహితులయ్యారు. చదువు తక్కువే అయినా, మొబైల్ టెక్నాలజీని వాడటంలో వీరు దిట్ట. గతేడాది నవంబర్లో జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ తమ పాత వృత్తిని మొదలుపెట్టారు.
వారం రోజుల్లోనే ఆట కట్టించిన కాశీబుగ్గ పోలీసులు
దొంగతనం జరిగిన వారం రోజుల్లోనే కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి 6.5 తులాల బంగారం, 15 కేజీల వెండి, రూ. 80 వేల నగదును పూర్తిగా రికవరీ చేశారు.
నిందితులపై ఉన్న సస్పెక్ట్ షీట్ (Suspect Sheet) ఆధారంగా వారి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో వీరిని పట్టుకున్నారు.
దేవుడి మహిమేనంటున్న భక్తులు!
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి సొత్తును కాజేయాలని చూసిన దొంగలు, వారం తిరగకముందే దొరికిపోవడం స్వామివారి మహిమేనని భక్తులు నమ్ముతున్నారు. "దేవుడి సొత్తు తింటే అరగదు" అనడానికి ఈ ఘటనే నిదర్శనమని పలాస ప్రజలు చర్చించుకుంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




