TTD: టీటీడీలో ముదురుతున్న శనీశ్వరం విగ్రహ వివాదం
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు పోలీసుల నోటీసులు భూమనపై అలిపిరి పీఎస్లో కేసు నమోదు అలిపిరి పార్కింగ్ లాట్లో విష్ణుమూర్తి విగ్రహం పేరుతో.. అసత్యాలు ప్రచారం చేశారని డిప్యూటీ DEE గోవిందరాజు ఫిర్యాదు విచారణకు హాజరుకావాలని పోలీసుల ఆదేశం
తిరుపతిలో అసంపూర్తిగా ఉన్న శనీశ్వర విగ్రహంపై రెండు దశాబ్దాల తర్వాత అకస్మాత్తుగా రాజకీయ దుమారం చెలరేగింది. ఇది విష్ణుమూర్తి విగ్రహమంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
నిన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల సమీపాన ఉన్న ఓ విగ్రహం పాదపీఠికకు మొక్కి భూమన కళ్లకద్దుకున్నారు. కోనేటిరాయుడా ఏమిటీ నీకీ దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుమూర్తి విగ్రహాన్ని పడేసి, అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారని, మద్యం తాగుతున్నారని ఆయన ఆరోపించారు. హిందూ సంఘాలన్నీ ఏకమై ఈ అపచారాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ అయింది.
భూమన కరుణాకర్రెడ్డి ఆరోపణలపై టీడీపీ నేతలు వెంటనే స్పందించారు. ఆ విగ్రహం విష్ణుమూర్తిది కాదని, అది అభయ శనేశ్వర విగ్రహమని వారు రుజువు చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఆ విగ్రహం అక్కడే ఉందని స్పష్టం చేస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం భూమన ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే భూమన టార్గెట్ అని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమనకు ఈ విషయం తెలియదా అంటూ వారు ప్రశ్నించారు.
ఈ వివాదంపై తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై టీటీడీ, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ తీవ్రంగా హెచ్చరించారు.
టీటీడీపై దుష్పచారం చేస్తూ.. హిందువుల మనోభావాలను దేభతెస్తున్నారంటూ టీటీడీ డీఈఈ గోవిందరాజులు భూమనపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించి సమాజంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని, విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందంటూ.. భూమన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నాయన్నారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ వివాదం నడుస్తుండగా ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కన్నయ్యచారి కుమారుడు గురుస్వామి మీడియా ముందుకు వచ్చారు. 22 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన వ్యక్తి 2 లక్షలు ఇచ్చి, పది చేతులు, సింహంతో కూడిన శనీశ్వరుడి విగ్రహం చేయమని తమని కోరారని, ఆ వ్యక్తి చనిపోవడంతో ఆ విగ్రహం అక్కడే ఉండిపోయిందని గురుస్వామి వివరణ ఇచ్చారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire