
IPO: ఇన్వెస్టర్లు ఎగిరిగంతేసే వార్త.. ప్రభుత్వ సంస్థ నుంచి మెగా ఐపీఓ..ధరతోపాటు పూర్తి వివరాలు ఇవే..!!
Bharat Coking Coal IPO: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఐపీఓలు (Initial Public Offering) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక ప్రైవేట్ సంస్థ తొలిసారిగా తన షేర్లను సామాన్య ప్రజలకు విక్రయిస్తూ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారే ప్రక్రియనే ఐపీఓగా పిలుస్తారు. ఈ మార్గం ద్వారా కంపెనీలు కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేసి భారీగా నిధులను సమీకరిస్తాయి. ఈ నిధులను అప్పుల చెల్లింపులు, వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, మూలధన అవసరాల కోసం వినియోగిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఐపీఓలు లిస్టింగ్ రోజునే మంచి లాభాలను ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అందుకే పెట్టుబడిదారుల్లో ఐపీఓల పట్ల ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ఐపీఓలకు మార్కెట్లో మరింత డిమాండ్ ఉంటుంది. విశ్వసనీయత, స్థిరమైన వ్యాపారం, దీర్ఘకాలిక దృష్టికోణం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి మరో కీలక ఐపీఓ మార్కెట్లోకి రాబోతోంది. అదే దేశంలోనే అతిపెద్ద మైనింగ్ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL).
ఇటీవల కోల్ ఇండియాకు చెందిన అన్ని అనుబంధ సంస్థలను 2030 నాటికి పబ్లిక్ లిస్టింగ్కు తీసుకురావాలన్న దిశగా ప్రధానమంత్రి కార్యాలయం సూచనలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో భాగంగానే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీఓను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ జనవరి 9న ప్రారంభం కానుండగా, సబ్స్క్రిప్షన్కు చివరి తేదీ జనవరి 13గా నిర్ణయించారు.
ఈ ఐపీఓకు ఒక్కో షేరు ధర రూ.21 నుంచి రూ.23 మధ్యగా నిర్ణయించారు. ఒక లాట్లో కనీసం 600 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం కనీస పెట్టుబడి రూ.12,600 కాగా, గరిష్ఠంగా రూ.13,800 వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అర్హత కలిగిన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.1 డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నారు.
ఈ ఐపీఓ పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ విధానంలోనే నిర్వహించనున్నారు. అంటే కంపెనీకి కొత్తగా నిధులు రాకుండా, పేరెంట్ కంపెనీ అయిన కోల్ ఇండియా తన వాటాలో భాగాన్ని విక్రయించనుంది. మొత్తం 4,65,70,000 ఈక్విటీ షేర్లను ఐపీఓ కోసం అందుబాటులో ఉంచుతూ, సుమారు రూ.1,068.78 కోట్ల నిధులను సమీకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం 10 శాతం విక్రయించనుంది. ఇప్పటికే ఈ ఐపీఓ గ్రే మార్కెట్లో మంచి హడావుడిని సృష్టిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం ఇష్యూ ధరతో పోలిస్తే 70 నుంచి 80 శాతం వరకు ఎక్కువగా ఉందని సమాచారం. జనవరి 5 నాటికి ఒక్కో షేరుపై జీఎంపీ సుమారు రూ.16.25గా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ లెక్కన షేరు లిస్టింగ్ ధర దాదాపు రూ.39 ప్రాంతంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా గ్రే మార్కెట్ అంచనాలకు దగ్గరగానే లిస్టింగ్ జరుగుతుంది. ఐపీఓ ప్రారంభం వరకు ఇదే ధోరణి కొనసాగితే, ఇన్వెస్టర్లకు మంచి రాబడులు దక్కే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




