Anil Ambani: అనిల్ అంబానీకి సీబీఐ షాక్.. రూ.1,085 కోట్ల భారీ మోసంపై కేసు నమోదు!

Anil Ambani
x

Anil Ambani: అనిల్ అంబానీకి సీబీఐ షాక్.. రూ.1,085 కోట్ల భారీ మోసంపై కేసు నమోదు!

Highlights

Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. పీఎన్బీ (PNB) ఫిర్యాదుతో రూ. 1,085 కోట్ల బ్యాంక్ మోసం కేసు నమోదు చేసింది. ఆర్‌కామ్ (RCom) నిధుల మళ్లింపు, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక మరియు ఈ కుంభకోణం వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఆయనపై, ఆయన సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), మాజీ డైరెక్టర్ మంజరి అశోక్ కక్కర్‌లపై రూ.1,085 కోట్ల బ్యాంక్ మోసం కేసును నమోదు చేసింది. 2013 నుంచి 2017 మధ్య కాలంలో ఆర్‌కామ్ సంస్థ కోసం బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది, ఆ నిధులను ఇతర ప్రయోజనాలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల పీఎన్బీకి రూ.621.39 కోట్లు, గతంలో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.463.80 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

ఈ కుంభకోణానికి సంబంధించి BDO ఇండియా LLP నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రుణ నిధుల మళ్లింపుతో పాటు సంబంధిత పార్టీలతో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఆడిట్ నివేదిక ధృవీకరించింది. వాయిదాల చెల్లింపులు ఆగిపోవడంతో 2017లోనే ఈ రుణాలను నిరర్థక ఆస్తులు (NPA)గా ప్రకటించారు. సీబీఐ ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 120B (నేరపూరిత కుట్ర), 420 (మోసం)తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుట్రలో కొంతమంది గుర్తుతెలియని ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది, ఇది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిల్ అంబానీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టేలా ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories