CMIE : ఫ్యాషన్‌కు నో.. 'ఫన్'కు ఓకే అంటున్న భారతీయులు.. దుస్తుల కంటే మందు పైనే ఎక్కువ ఖర్చు

CMIE : ఫ్యాషన్‌కు నో.. ఫన్కు ఓకే అంటున్న భారతీయులు.. దుస్తుల కంటే మందు పైనే ఎక్కువ ఖర్చు
x
Highlights

CMIE: మన దేశంలో సామాన్యులు ఏ వస్తువులపై ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ఒక ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది.

CMIE: మన దేశంలో సామాన్యులు ఏ వస్తువులపై ఎంత ఖర్చు చేస్తున్నారు అనే దానిపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ఒక ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారతీయులు బట్టలు కొనడం కంటే మద్యం తాగడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారట. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. CMIE నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కుటుంబాల ఖర్చు తీరులో పెద్ద మార్పు కనిపించింది. ప్రజలు గతంతో పోలిస్తే, దుస్తుల కొనుగోలుపై ఖర్చును తగ్గించి, మద్యం వినియోగంపై ఎక్కువ దృష్టి పెట్టారు.

2022-23లో దేశ ప్రజలు దుస్తులపై రూ. 7.60 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2023-24లో అది కాస్తా రూ. 7.29 లక్షల కోట్లకు తగ్గింది. అంటే, దాదాపు రూ. 31,000 కోట్లు తక్కువగా ఖర్చు చేశారు. దీనికి విరుద్ధంగా, ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై ఖర్చు అమాంతం పెరిగింది. 2022-23లో ప్రజలు మద్యంపై రూ. 0.95 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2023-24లో అది ఏకంగా రూ. 1.20 లక్షల కోట్లకు చేరింది. అంటే, మద్యం వినియోగంపై వ్యయం 26% పెరిగింది. ఈ గణాంకాలు వినియోగదారుల ప్రాధాన్యతలలో వస్తున్న స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు 'ఫ్యాషన్' కంటే 'ఫన్' వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు.

మద్యంపై ఖర్చు పెరుగుతున్నా, ప్రజలు నిత్యావసరాలు, ఆరోగ్యం వంటి ముఖ్య రంగాలపై కూడా శ్రద్ధ పెట్టినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 2022-23తో పోలిస్తే 2023-24లో ప్రజలు ధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, జున్ను, పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసరాలపై ఎక్కువ ఖర్చు చేశారు. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల వీటి ధరలు పెరిగినప్పటికీ, ప్రజలు వీటిని కొనుగోలు చేయక తప్పడం లేదు. చాక్లెట్లు, చక్కెర, జామ్ వంటి స్వీట్లు మరియు చిరుతిళ్లపై ఖర్చు కూడా 19.78% పెరిగింది. ఆరోగ్యంపై పెట్టే ఖర్చు ఏకంగా 18.75% పెరిగింది. ఆరోగ్య స్పృహ పెరుగుతున్నందున ప్రజలు తమ శారీరక శ్రేయస్సు కోసం ఎక్కువ వెచ్చిస్తున్నారని ఇది చూపిస్తుంది. అన్ని రంగాల్లో కలిపి మొత్తం వినియోగదారుల ఖర్చు ఒక సంవత్సరంలో 9.72శాతం పెరిగి రూ. 181.4 లక్షల కోట్లకు చేరుకుంది.

కొన్ని కేటగిరీలలో మాత్రం ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకున్నారు. వంట నూనెలు, ఇతర కొవ్వు పదార్థాలపై అయ్యే ఖర్చు 19.67% తగ్గింది. ఇది ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మల్లుతున్నారని లేదా ద్రవ్యోల్బణం కారణంగా ఈ వస్తువుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారని సూచించవచ్చు. ఆరోగ్యంపై ఖర్చు పెరిగినప్పటికీ, బీమా ప్రీమియంపై ఖర్చు గత సంవత్సరంతో పోలిస్తే 3.39% తగ్గింది. ఇది కొంతమంది ఆర్థిక ప్రణాళికలో మార్పులు చేసుకుంటున్నారని లేదా బీమా అవసరాన్ని తగ్గించుకుంటున్నారని సూచిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ పై ఖర్చులో 1.38% స్వల్ప తగ్గుదల కనిపించింది. అయితే, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ ఖర్చు మాత్రం 8% పెరిగింది. ఇది ప్రజలు వినోదం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని లేదా కమ్యూనికేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సూచించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories