
సిగరెట్, గుట్కా నుంచి గ్యాస్ సిలిండర్ వరకు.. నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్
February 1st Changes: ఫిబ్రవరి నెల వచ్చేసింది.. దీనితో పాటు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టే మరికొన్ని మార్పులు కూడా అమల్లోకి వచ్చాయి. ఈరోజు అంటే ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు మారుతున్నాయి. ఒకవైపు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరల నుంచి బ్యాంకింగ్ నిబంధనల వరకు అన్నీ మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఫిబ్రవరి 1 నుంచే మారనున్న కీలక నిబంధనలు
1. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరల పెంపు: ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్లో పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ, అదనపు సెస్ను పెంచనుంది. దీనివల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరిగి వ్యసనపరుల జేబుకు చిల్లు పడనుంది.
2. వంట గ్యాస్ సిలిండర్ ధరల సమీక్ష: ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గత నెలలో ఇవి కాస్త తగ్గగా, ఈసారి బడ్జెట్ ప్రభావం వీటిపై ఎలా ఉంటుందోనని సామాన్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటే అది నేరుగా వంటింటి బడ్జెట్పై ప్రభావం చూపుతుంది.
3. ఫాస్టాగ్ కేవైసీ నిబంధనల సరళీకరణ: వాహనదారులకు ఇది అతిపెద్ద ఊరట. ఇకపై ఫాస్టాగ్ వినియోగదారులు పదేపదే కేవైసీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బాధ్యతను NHAI ఇప్పుడు బ్యాంకులకు అప్పగించింది. కొత్త ఫాస్టాగ్ ఇచ్చే ముందే బ్యాంకులు వాహనం, యజమాని వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. దీనివల్ల సామాన్యులకు టోల్ ప్లాజాల వద్ద డాక్యుమెంటేషన్ తలనొప్పులు తప్పుతాయి.
4. ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీల మార్పు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన IMPS (Instant Payment Service) ఛార్జీలలో మార్పులు చేస్తోంది. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 25,000 నుంచి రూ. 5 లక్షల వరకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపే వారు అదనంగా సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల బదిలీకి సుమారు రూ.10 ప్లస్ జీఎస్టీ వసూలు చేయనున్నారు.
5. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేవైసీ హెచ్చరిక: మీకు పీఎన్బీలో ఖాతా ఉంటే వెంటనే కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలి. ఫిబ్రవరి 2 లోపు కేవైసీ పూర్తి చేయని ఖాతాదారుల అకౌంట్లను స్తంభింపజేసే అవకాశం ఉందని బ్యాంక్ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి.
6. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లపై కోత: హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నియమాలను కఠినతరం చేశాయి. ఇకపై రివార్డ్ పాయింట్ల వినియోగంపై పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు, హెచ్డీఎఫ్సీ ఇన్ఫినియా కార్డ్ వాడేవారు నెలకు కేవలం 5 సార్లు మాత్రమే పాయింట్లను రిడీమ్ చేసుకోగలరు. అలాగే ఉచిత మూవీ టికెట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి సౌకర్యాలలో కూడా కోతలు విధిస్తున్నారు.
7. విమాన ప్రయాణ ఖర్చులు: విమాన ఇంధనం లేదా ఏటీఎఫ్ ధరలను కూడా నేడు సవరించనున్నారు. ఒకవేళ ఇంధన ధరలు పెరిగితే విమాన సంస్థలు ఆ భారాన్ని ప్రయాణికులపైనే వేస్తాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




