
Post Office: ఐదేళ్లలో రూ. 2.25 లక్షల లాభం.. ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే..!!
Post Office: నేటి రోజుల్లో షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ల వంటి పెట్టుబడి మార్గాలు ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ… తమ కష్టపడి సంపాదించిన డబ్బు ఎలాంటి ప్రమాదానికి గురికాకూడదని అనుకునే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వృద్ధులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు స్థిరమైన ఆదాయం ఇచ్చే, పూర్తిస్థాయి భద్రత కలిగిన పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అటువంటి వారి అవసరాలకు సరిపోయే నమ్మకమైన ఎంపికగా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం నిలుస్తోంది. 2026 నాటికీ ఈ స్కీమ్ బ్యాంకులతో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పెట్టుబడిదారులను ఆకట్టుకుంటోంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది సూత్రప్రాయంగా బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే. ఇందులో ఒకేసారి ఒక మొత్తాన్ని నిర్ణీత కాలానికి జమ చేయాలి. పెట్టుబడి వ్యవధిని బట్టి ఈ పథకం నాలుగు రకాలుగా అందుబాటులో ఉంటుంది. అవి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల కాలపరిమితులు. ఎంచుకున్న కాలానికి అనుగుణంగా వడ్డీ శాతం మారుతుంది. పోస్టాఫీస్ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయిస్తుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఐదేళ్ల డిపాజిట్పై 7.5 శాతం వడ్డీ ఇవ్వని పరిస్థితిలో, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పెట్టుబడిదారులకు మెరుగైన అవకాశంగా మారింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లను పరిశీలిస్తే… ఒక సంవత్సర కాలపరిమితి గల టైమ్ డిపాజిట్పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. రెండు సంవత్సరాల డిపాజిట్కు 7.0 శాతం, మూడు సంవత్సరాలకు 7.1 శాతం వడ్డీ ఉంది. అత్యధికంగా ఐదేళ్ల టైమ్ డిపాజిట్పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. దీర్ఘకాల పెట్టుబడులకు ఇది మంచి రాబడిని ఇస్తోంది.
ఈ పథకంలో చక్రవడ్డీ విధానం అమల్లో ఉంటుంది. అంటే ప్రతి ఏడాది వచ్చిన వడ్డీ కూడా అసలు మొత్తంలో కలిసిపోతూ, తదుపరి సంవత్సరాల్లో మరింత వడ్డీ వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకు… ఒక వ్యక్తి రూ.5 లక్షలను ఐదేళ్ల కాలపరిమితి గల టైమ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టినట్లు భావిస్తే, ప్రస్తుత 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్ల ముగింపుకు మొత్తం వడ్డీ సుమారు రూ.2,24,975గా ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో చేతికి వచ్చే మొత్తం రూ.7,24,975. అంటే ఐదేళ్లలో ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడిపై దాదాపు 45 శాతం వరకు లాభం పొందినట్లే.
మార్కెట్లో జరిగే హెచ్చుతగ్గులు తమ పెట్టుబడిని ప్రభావితం చేయకూడదని అనుకునే వారికి ఇది అత్యంత భద్రమైన మార్గం. అంతేకాదు, ఐదేళ్ల కాలపరిమితి గల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లో పెట్టుబడి చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పదవీ విరమణ సమయంలో వచ్చే గ్రాట్యుటీ లేదా ఇతర పొదుపు నిధులను సురక్షితంగా దాచుకుని, నిర్ధిష్ట కాలం తర్వాత మంచి మొత్తాన్ని పొందేందుకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.
ఈ ఖాతాను సమీపంలోని ఏ పోస్టాఫీస్లోనైనా ప్రారంభించవచ్చు. ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు అవసరం. కనీసంగా రూ.వెయ్యి పెట్టుబడితో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. ఒక్కరి పేరుతో లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్గా కూడా తెరవచ్చు. భద్రత, స్థిరత్వం, నమ్మకమైన రాబడిని కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక సుస్థిరమైన పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




