PhonePe Rule Violations: నిబంధనలు ఉల్లంఘించిన ఫోన్‌పే.. ఆర్బీఐ కఠిన నిర్ణయం.. లక్షల్లో జరిమానా

PhonePe Rule Violations
x

PhonePe Rule Violations: నిబంధనలు ఉల్లంఘించిన ఫోన్‌పే.. ఆర్బీఐ కఠిన నిర్ణయం.. లక్షల్లో జరిమానా

Highlights

PhonePe Rule Violations: నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఫోన్‌పేకు రూ. 21 లక్షల జరిమానా విధించినట్టు ఆర్బీఐ తాజా సర్క్యులర్ ద్వారా వెల్లడించింది.

PhonePe Rule Violations: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో ముందంజ వహిస్తున్న ప్రముఖ కంపెనీ ఫోన్‌పే లిమిటెడ్‌పై కేంద్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఫోన్‌పేకు రూ. 21 లక్షల జరిమానా విధించినట్టు ఆర్బీఐ తాజా సర్క్యులర్ ద్వారా వెల్లడించింది.

ఆర్బీఐ తెలిపినట్లు… ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) కు సంబంధించిన నియంత్రణ నిబంధనలను ఫోన్‌పే పాటించలేదని గుర్తించింది. 2023 అక్టోబర్ నుండి 2024 డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో కంపెనీ ఎస్క్రో ఖాతాలో రోజువారీ చివర్లో ఉండాల్సిన బ్యాలెన్స్ చెల్లించాల్సిన మొత్తం కంటే తక్కువగా ఉండటం తెలిసింది.

ఫోన్‌పే దీనిని RBIకి తెలియజేయడంలోనూ విఫలమైందని కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది. సంస్థ ఇచ్చిన రిప్లైలు, విచారణ సమయంలోని వాదనలు పరిశీలించిన అనంతరం ఈ జరిమానా విధించినట్లు ప్రకటించింది.

RBI ప్రకారం, ఎస్క్రో ఖాతా అనగా మధ్యవర్తి (Trusted Third Party) వద్ద తాత్కాలికంగా డబ్బులు నిల్వ చేసే ప్రత్యేక బ్యాంక్ అకౌంట్. దీనివల్ల, రెండు వర్గాల మధ్య నేరుగా లావాదేవీలు జరగకుండా ఉంటాయి. ఈ నిబంధన ఉల్లంఘనతో ఫోన్‌పేపై చర్యలు తీసుకోవడం ద్వారా ఇతర కంపెనీలకు కూడా సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఫోన్‌పే ఏటా చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ సంస్థలను ఐపీఓ నిర్వహణకు నియమించుకుంది. ఈ నేపథ్యంలో పెనాల్టీ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం దేశంలో యూపీఐ డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్‌పే ప్రాధాన్యతను సొంతం చేసుకుంది. ఆగస్ట్ నెలలో మొత్తం యూపీఐ లావాదేవీలలో ఫోన్‌పే వాటా 48.64 శాతం‌గా ఉంది. గూగుల్ పే వాటా 35.53 శాతం కాగా, పేటీఎం వాటా కేవలం 8.5 శాతం ఉండటం విశేషం. ఒక్క నెలలోనే ఫోన్‌పే ద్వారా 960 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు RBI గణాంకాలు వెల్లడించాయి.

ఫోన్‌పే పై విధించిన జరిమానా సంస్థ కస్టమర్ల లావాదేవీలపై, ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని RBI తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories