
Gold Loan: గోల్డ్ లోన్ విషయంలో ఒక కస్టమర్కు అన్యాయం జరిగిందని భావించిన సుప్రీంకోర్టు, బ్యాంకు తీరును తప్పుపడుతూ కీలక తీర్పును ఇచ్చింది.
Gold Loan: గోల్డ్ లోన్ విషయంలో ఒక కస్టమర్కు అన్యాయం జరిగిందని భావించిన సుప్రీంకోర్టు, బ్యాంకు తీరును తప్పుపడుతూ కీలక తీర్పును ఇచ్చింది. కస్టమర్ నుంచి తాకట్టు తీసుకున్న బంగారాన్ని రీపేమెంట్ తర్వాత తిరిగి ఇవ్వకుండా, అది నకిలీ అని పేర్కొంటూ రీ ఎవాల్యుయేట్ చేయడాన్ని కోర్టు గట్టిగా ఖండించింది. అంతేకాక, బ్యాంకు అధికారులపై నమోదైన కేసును తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది.
కేసు వివరాల్లోకి వెళితే.. బీహార్కు చెందిన అభిషేక్ సింగ్ అనే వ్యక్తి 2020 జూలై 22న బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతీజీల్ బ్రాంచ్ నుంచి రూ. 7.7 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఈ లోన్కు బదులుగా 254 గ్రాముల 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టాడు. అప్పు సకాలంలో చెల్లించకపోయినప్పటికీ, 2023 మార్చి 31న అభిషేక్ మొత్తం రీపేమెంట్ చేశాడు.
అయితే అప్పటికి బ్యాంక్ ఆభరణాలను తిరిగి ఇవ్వలేదు. బంగారం నకిలీ అని చెబుతూ రీ-ఎవాల్యుయేషన్ చేసి, వేలం వేశామని తెలిపింది. పైగా అభిషేక్ మోసం చేశాడని ఆరోపిస్తూ 2023 మే 22న బ్యాంకు పోలీసులు వద్దకు వెళ్లింది.
కౌంటర్ కేసుతో సుప్రీంకోర్టు వరకు...
బ్యాంకు చర్యలపై అభిషేక్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. బ్యాంకు తనపై చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ పాట్నా హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు అభిషేక్ కంప్లైంట్ను బ్యాంకు FIRకి కౌంటర్ చర్యగా పేర్కొంటూ రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అభిషేక్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు.
సుప్రీంకోర్టు ఏమంది?
న్యాయమూర్తులు సంజయ్ కరోల్, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం, పాట్నా హైకోర్టు తీర్పును రద్దు చేసింది. అభిషేక్ రీపేమెంట్ చేసిన తర్వాత బంగారాన్ని రీ-ఎవాల్యుయేట్ చేయడానికి బ్యాంకుకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది. ఏదైనా తప్పు జరిగిందని బ్యాంక్ అనుకుంటే, అది ప్రారంభ వాల్యుయేషన్ సమయంలో జరిగిందా, తర్వాత జరిగిందా అన్నదాన్ని దర్యాప్తు చేయాలని నోటీసులు జారీ చేసింది.
కస్టమర్ తాకట్టు పెట్టిన తర్వాత ఆ బంగారం పూర్తిగా బ్యాంకు కస్టడీలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మోసం జరిగితే, దానికి బ్యాంకు సిబ్బంది బాధ్యత కూడా తప్పదు. ఇలాంటి సందర్భాల్లో మినహాయింపు లేదని కోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో బ్యాంకు అధికారులపై నమోదైన కేసును కొనసాగించాల్సిందేనన్న స్పష్టత వచ్చింది. అభిషేక్ చేసిన ఆరోపణలు పరిశీలనకు అర్హమవుతాయని పేర్కొంటూ, విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. లోన్ చెల్లింపునంతరంగా బంగారాన్ని వేరేలా వాడటానికి బ్యాంకులకు హక్కు లేదని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఈ తీర్పు తదుపరి కేసుల్లో ప్రామాణికంగా నిలవొచ్చు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire