Narketpally Road Accident: నార్కట్‌పల్లి హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్ల మృతి

Narketpally Road Accident: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి
x

Narketpally Road Accident

Highlights

Narketpally Road Accident: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి చెందారు.

Narketpally Road Accident: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రైవేట్ బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నార్కట్‌పల్లి - నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్ద మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను మోజో ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం, మొదట మోజో ట్రావెల్స్‌కు చెందిన బస్సు (NL 02 3119), గుజరాత్ రిజిస్ట్రేషన్ కలిగిన లారీ (GJ 16 AW 5757) మధ్య స్వల్ప రాపిడి జరిగింది. ఈ విషయంలో మాట్లాడుకోవడానికి డ్రైవర్లు తమ వాహనాలను రహదారి పక్కన నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి మరో మోజో ట్రావెల్స్ బస్సు (NL 02 3126) కూడా వచ్చి ఆగింది.

వాహనదారులు కిందకు దిగి మాట్లాడుతుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన మరో లారీ (AP 31 TH 1289) ఆగి ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వాహనాల మధ్య ఉన్న డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యలు నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మొదటి బస్సు క్లీనర్ సురేష్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన వెంటనే నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనాల భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ల అజాగ్రత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జాతీయ రహదారిపై వాహనాలను నిలిపే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ పెను ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ - విజయవాడ హైవేపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories