
తపాలా శాఖలో భారీ కొలువుల జాతర.. నేడే దరఖాస్తుకు ఆఖరి రోజు.. అస్సలు మిస్ కావద్దు
Jobs : కేవలం పదో తరగతి పాసై, సొంత ఊర్లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు భారత తపాలా శాఖ ఒక సువర్ణావకాశాన్ని అందించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్ గడువు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే (ఫిబ్రవరి 16, 2026) ఆఖరి రోజు. సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్వర్ సమస్యలు తలెత్తకముందే త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు, తెలంగాణలో 608 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. చాలా మంది అభ్యర్థులు కాంపిటీటివ్ పరీక్షలంటే భయపడుతుంటారు, అలాంటి వారికి ఇది గొప్ప అవకాశం. పదో తరగతి మార్కుల జాబితాను బట్టి షార్ట్ లిస్ట్ చేసి, నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగం ఇస్తారు. ఒక్క రూపాయి లంచం లేకుండా, పారదర్శకమైన పద్ధతిలో కేవలం మెరిట్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసుకోవచ్చు.
వయోపరిమితి, సడలింపుల వివరాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో భారీ సడలింపులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల పాటు గరిష్ట వయోపరిమితిని సడలించారు. అదేవిధంగా దివ్యాంగులకు ఏకంగా పదేళ్ల వరకు సడలింపు లభించనుంది. దీనివల్ల ఎక్కువ మంది నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కింది.
జీతం, ఇతర ప్రయోజనాలు
ఎంపికైన అభ్యర్థులకు విధులను బట్టి ఆకర్షణీయమైన గౌరవ వేతనం అందుతుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) హోదాలో ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి ప్రారంభమై రూ.29,380 వరకు వేతనం పెరుగుతుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) లేదా డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైతే రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతం లభిస్తుంది. కేవలం 4 నుంచి 5 గంటల పని వేళలు ఉండటం వల్ల, ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే వారికి లేదా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ ఉద్యోగం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే తపాలా శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పదో తరగతి మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటో, సంతకాన్ని సిద్ధం చేసుకుని ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత మెరిట్ లిస్ట్ను వెబ్సైట్లో ఉంచుతారు. ఎంపికైన అభ్యర్థులకు మొబైల్ ఎస్ఎంఎస్, ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా సమాచారం అందుతుంది. గడువు ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నందున, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేసుకోవడం ఉత్తమం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




