Animal Emotion: జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయని తెలుసా?


జంతువులకూ ఎమోషన్స్ ఉంటాయని తెలుసా?
సాధారణంగా భావోద్వేగాలు మనుషులకే ఉంటాయి అనుకుంటారు అందరూ. ఎవరైనా ఎమోషన్స్ లేకుండా కఠినంగా ఉంటే ‘నువ్వు మనిషివా? జంతువువా?’ అంటుంటారు.
సాధారణంగా భావోద్వేగాలు మనుషులకే ఉంటాయి అనుకుంటారు అందరూ. ఎవరైనా ఎమోషన్స్ లేకుండా కఠినంగా ఉంటే ‘నువ్వు మనిషివా? జంతువువా?’ అంటుంటారు. ఇక మీదట అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే భావోద్వేగాలు మనుషులకే కాదు, జంతువులకీ ఉంటాయని రుజువైంది. ఎవరైనా దగ్గరి వాళ్లు చనిపోతే మనుషులు ఎంత బాధపడతారో, కొన్ని జంతువులు కూడా అలాగే బాధపడతాయని పరిశోధనలో వెల్లడైంది.
ఇంట్లో ఎవరైనా చనిపోయినపుడు పెంపుడు కుక్కలు వాళ్ల మీద బెంగ పెట్టుకోవడం, వాళ్ల కోసం ఎదురు చూడడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే కుక్కలు మనుషులకు దగ్గరగా జీవిస్తాయి కాబట్టి వాటికి మాత్రమే అలాంటి ఎమోషన్స్ ఉంటాయి అనుకుంటారు చాలామంది. అయితే కుక్కలే కాకుండా చాలారకాల జంతువులు ఎమోషన్స్ని వ్యక్తపరుస్తాయని ఇటీవల కనుగొన్నారు.
తన పార్ట్నర్ మరణిస్తే... దాని గురించి బాధపడే జంతువులు చాలా ఉన్నాయట. జంతువుల ఎమోషన్స్పై చేసిన అధ్యయనంలో రకరకాల జంతువులు రకరకాల విధాలుగా ఎమోషన్స్ని వ్యక్తపరుస్తున్నాయట. కొన్నిరకాల జీవులు కేవలం దుఃఖించడం మాత్రమే కాకుండా, కొన్ని ఆచారాలను కూడా పాటిస్తున్నాయి. మరికొన్ని మనుషుల లాగానే అంత్యక్రియలు చేస్తూ కనిపించాయట.
అంత్యక్రియలు చేస్తూ...
చింపాంజీలు మనిషితో పాటుగా భావాలను వ్యక్తపరచగలవు. ఒక చింపాంజీ మరణిస్తే.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మిగతా చింపాంజీలకు కొన్ని వారాల సమయం పడుతుంది. చింపాంజీ కుటుంబంలో ఏదైనా చనిపోయినప్పుడు , మిగిలిన చింపాంజీలు తమ కుటుంబ సభ్యులందరితో కలిసి మృతదేహం చుట్టూ గుండ్రంగా చేరి, మృతదేహాన్ని తాకుతూ ఉంటాయట. కొన్ని సందర్భాలలో, బిడ్డ చనిపోతే ఆ శరీరాన్ని అంటిపెట్టుకుని కొన్ని నెలలపాటు ఆ కళేబరాలను మోసుకుంటూ తిరుగుతూ కనిపిస్తుంటాయట. మనుషులకు దగ్గరగా బాధను వ్యక్తపరచే జీవులలో చింపాంజీలు ముందు వరసలో ఉంటాయి.
ప్రాణాలే అర్పిస్తాయి
చింపాంజీల తర్వాత అంతలా బాధపడేది కుక్కలు. పెంపుడు కుక్కలు తమ యజమాని మరణించినపుడు ఎంతో భావోద్వేగానికి లోనవుతాయి. అయితే కేవలం పెంపుడు కుక్కలే కాకుండా అడవుల్లో ఉండే కుక్కలు కూడా ఇంతే భావోద్వేగాన్ని చూపుతాయట. తమ గుంపులో ఏదైనా మరణిస్తే, ఏడుస్తూ దేహాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ మృతదేహం మీద పడి ఏడుస్తూ తమ భావాలను వ్యక్తపరుస్తుంటాయి. ఇలా ఒక్కోసారి బాధ ఎక్కువై ప్రాణాలను కూడా కోల్పోతాయట. జంతువులన్నింటిలో కుక్కలే ఎక్కువ ఎమోషనల్ అవుతాయని పరిశోధకులు అంటున్నారు.
సంతాపం తెలుపుతాయి.
గుర్రాల్లో ఏదైనా మరణించిన్నప్పుడు, మిగతా గుర్రాలు ఆ మృతదేహం చుట్టూ నిలబడి నిశ్శబ్ద౦గా గంటల తరబడి ఉంటాయట. కొన్నిసార్లు తలను క్రిందకు దించి, మృతదేహానికి సంతాపం తెలుపుతాయట. కొన్ని గుర్రాలు మాత్రం తన జ౦ట చనిపోవడాన్ని జీర్ణించుకోలేక, ఏడుస్తూ , పెద్దగా అరుస్తూ అటు ఇటు ఉరుకుతుంటాయి.
ఓదార్పుతో...
మనిషి తర్వాత తెలివైన జీవుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. డాల్ఫిన్స్ తమ జంట కోల్పోయినప్పడు మనిషిలాగే మృతదేహాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తుందట. ఒక డాల్ఫిన్ చనిపోయినప్పుడు, దానికి సన్నిహితమైన డాల్ఫిన్ బాధపడుతుంటే మిగిలిన డాల్ఫిన్స్ బాధపడుతున్న డాల్ఫిన్ని నిమురుతూ ఓదారుస్తాయట.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



