
Fruit vs Fruit Juice : పండు Vs పండ్ల రసం.. ఆరోగ్యానికి ఈ రెండింటిలో ఏది ఉత్తమం?
ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
Fruit vs Fruit Juice : ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వైద్యులు కూడా సీజనల్ పండ్లను తినాలని సిఫార్సు చేస్తారు. అయితే కొంతమంది పండ్లను తినడానికి ఇష్టపడితే, మరికొందరు వాటిని జ్యూస్ రూపంలో తాగడానికి ఆసక్తి చూపిస్తారు. పండు అయినా, జ్యూస్ అయినా ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరం, ఏది ఉత్తమం? ఈ విషయంలో నిపుణులు ఏమి చెబుతున్నారో, పండును ఎందుకు జ్యూస్ కంటే ఆరోగ్యకరమైన ఆప్షన్గా పరిగణిస్తారో తెలుసుకుందాం.
తాజా పండ్లు, పండ్ల రసం రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, ఈ రెండింటిలో ఆరోగ్యకరమైన ఎంపిక చేసుకోవాలంటే, నిపుణులు జ్యూస్కు బదులుగా పండును తినడానికే ఎక్కువగా సిఫార్సు చేస్తారు. పండు తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు, పేగుల ఆరోగ్యానికి ఈ ఫైబర్ చాలా అవసరం. కానీ, పండ్లను జ్యూస్ చేసినప్పుడు ఈ ముఖ్యమైన ఫైబర్ మొత్తం నష్టపోతుంది. పండ్లలో ఉండే రకరకాల విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అన్నీ పండును పూర్తిగా తిన్నప్పుడే మన శరీరానికి లభిస్తాయి. జ్యూస్ చేయడం వల్ల ఈ పోషకాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
జ్యూస్ తాగడంతో పోలిస్తే, పండు తినడం ద్వారా శరీరంలో షుగర్ లెవల్స్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. పండును పూర్తిగా తింటే, పొట్ట ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది. అదే జ్యూస్ తాగితే త్వరగా ఆకలి వేస్తుంది. ఇది ఎక్కువ కేలరీలు తీసుకోవడానికి దారితీస్తుంది.
పండు తినడం ద్వారా తక్కువ కేలరీలతో ఎక్కువ తృప్తి లభిస్తుంది, ఇది బరువును అదుపులో ఉంచుతుంది. జ్యూస్ తాగడం వల్ల అధిక చక్కెర మరియు కేలరీలు తీసుకునే అవకాశం ఉంది, ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. మీరు పండ్లను జ్యూస్ చేసినప్పుడు, అందులోని ముఖ్యమైన పోషకాలు, ఫైబర్ పోతాయి. అందుకే పేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి, మలబద్ధకాన్ని నివారించడానికి పండును పూర్తిగా తినడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించే వారు జ్యూస్లకు బదులుగా పండ్లను తినాలి. అంతేకాకుండా, ప్యాకేజ్డ్ జ్యూస్లను పూర్తిగా నివారించడం ఉత్తమం. ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, ఆరోగ్యానికి, పోషకాలకు, జీర్ణవ్యవస్థకు తాజా పండే బెస్ట్ ఆప్షన్.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire