
India Population: ఒకప్పుడు భారత్ అతిపెద్ద బలమని భావించిన దాని యువ జనాభా, ఇప్పుడు నెమ్మదిగా ఒక కొత్త సవాలుగా మారుతోంది.
India Population: ఒకప్పుడు భారత్ అతిపెద్ద బలమని భావించిన దాని యువ జనాభా, ఇప్పుడు నెమ్మదిగా ఒక కొత్త సవాలుగా మారుతోంది. యువ దేశం అని గర్వంగా చెప్పుకునే మన దేశంలో భారత్ ధనిక దేశం అయ్యే ముందు వృద్ధాప్యంలోకి వెళ్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే, భారతదేశంలో జననాల రేటు తగ్గుతోంది, సగటు వయస్సు పెరుగుతోంది, వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ మార్పులు కేవలం సామాజికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ మార్పుకు మనం సమయానికి సిద్ధంగా ఉండగలమా, లేక వృద్ధాప్యం మన ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటుందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
వృద్ధాప్యం వైపు భారత్?
భారత్ తన యువ జనాభాను ప్రపంచానికి ఎప్పుడూ ఒక శక్తిగా చూపిస్తూ వచ్చింది. 65శాతం మంది జనాభా 35 ఏళ్ల లోపు ఉండడం వల్ల దేశానికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ లభిస్తుందని, అంటే ఎక్కువ మంది పని చేసే జనాభా, ఎక్కువ ఉత్పత్తి, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని నమ్మేవారు. అయితే, ప్రస్తుత గణాంకాలు ఆందోళన కలిగించే కొత్త చిత్రాన్ని చూపిస్తున్నాయి. జనాభా వృద్ధి వేగం తగ్గుతోంది. మరోవైపు, సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. ఈ మార్పుల వల్ల భారత్ వేగంగా వృద్ధుల దేశంగా మారుతోంది.
బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థ కూడా జనాభాను ఆర్థిక పురోగతికి మార్గదర్శకంగా మార్చడానికి కొన్ని కీలక సూచనలు చేసింది. భారత్ అంచనాలను చేరుకోవాలంటే నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి పెట్టాలని సూచించింది: పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధితో పాటు లేబర్ ఫోర్స్ విస్తరణ తయారీ రంగ కార్యకలాపాలను పెంచడం. బ్లూమ్బెర్గ్ ప్రకారం, భారత్ ఈ రంగాల్లో పురోగతి సాధిస్తే, జనాభా ప్రయోజనాన్ని పొంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వకుండా ఎవరూ ఆపలేరు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
* జననాల రేటు(ప్రతి 1,000 మంది జనాభాకు జననాలు) 2013లో 21.4 ఉండగా, 2022లో 19.1కి తగ్గింది.
* పట్టణ ప్రాంతాల్లో జననాల రేటు 17.3 నుండి 15.5కి పడిపోయింది.
* సగటు వయస్సు ఇప్పుడు 69.9 సంవత్సరాలు. ఇది 1970-75తో పోలిస్తే 20 సంవత్సరాలు ఎక్కువ.
* 2050 నాటికి భారత్లో 60 సంవత్సరాలకు పైబడిన జనాభా సుమారు 35 కోట్లు ఉండవచ్చు, ఇది అమెరికా ప్రస్తుత జనాభాతో సమానం.
భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
* శ్రామిక శక్తి తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి: తక్కువ జననాల రేటు అంటే భవిష్యత్తులో పని చేసే జనాభా తగ్గుతుంది. ఆధారపడే జనాభా పెరుగుతుంది. ఇది ఉత్పాదకత, డీపీ వృద్ధి పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
* హెల్త్కేర్ రంగంపై ఒత్తిడి: నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 75% మంది వృద్ధులు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. 70% మంది వృద్ధులు తమ ప్రాథమిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడుతున్నారు. దీంతో ఆరోగ్య మౌలిక సదుపాయాలపై భారీ భారం పడుతుంది.
* పింఛన్లు, సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడి: ప్రస్తుతం భారత్లో కేవలం 18% మంది వృద్ధులకు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, 78% మందికి ఎటువంటి పింఛను లభించడం లేదు. భవిష్యత్తులో ప్రభుత్వం పింఛన్లు, సామాజిక సంక్షేమ పథకాలను పెంచితే, ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఉంది.
* మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణంలో మార్పుల అవసరం: వృద్ధ జనాభాను దృష్టిలో ఉంచుకొని సీనియర్ ఫ్రెండ్లీ గృహాలు, వైద్య సదుపాయాలు, ప్రజా రవాణా వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం అవసరం అవుతుంది. ఈ కొత్త ఖర్చు ఆర్థిక విధానంలో భాగంగా మారుతుంది.
ఈ సంక్షోభంలో కూడా ఒక కొత్త మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. దీని సిల్వర్ ఎకానమీ అంటున్నారు. నీతి ఆయోగ్ ప్రకారం, భారతదేశంలో హోమ్ హెల్త్కేర్ మార్కెట్ 2027 నాటికి $21.3 బిలియన్లకు చేరుకోవచ్చు. సీనియర్ కేర్ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, పింఛను నిధుల నిర్వహణ, రిటైర్మెంట్ హోమ్స్ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ఇది ఒక కొత్త టార్గెట్ మార్కెట్ గా మారవచ్చు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire