
కన్నీటి సంద్రంలో బారామతి..నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు, తరలిరానున్న అమిత్ షా
Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవార్ సామ్రాజ్యంలో కీలక నేత అయిన అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం (జనవరి 28) ఉదయం బారామతిలో జరిగిన ఈ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో పాటు పైలట్లు, సిబ్బంది కలిపి మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అజిత్ పవార్ భౌతికకాయాన్ని బారామతిలోని ఆయన నివాసానికి తరలించారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడైన నాయకుడిగా, అడ్మినిస్ట్రేషన్ పై గట్టి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన అజిత్ పవార్ అకాల మరణం ఆ రాష్ట్రానికి తీరని లోటు. బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి ఎన్నికల ప్రచార సభల కోసం ప్రయాణిస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బొంబార్డియర్ లియర్ జెట్ 45 విమానం సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు సుమిత్ కపూర్, సంభవ్ పాఠక్, అటెండెంట్ పింకీ మాలి, సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్ ప్రాణాలు కోల్పోయారు.
అజిత్ పవార్ భౌతికకాయాన్ని పూణేలోని బారామతికి తీసుకువచ్చినప్పుడు వాతావరణం అత్యంత భారంగా మారింది. ఆయన భార్య సునేత్రా పవార్, కుమారులు పార్త్, జయ్ పవార్ అశ్రునయనాలతో నివాళులర్పించారు. విద్యా ప్రతిష్ఠాన్ కాలేజీలో భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచగా, వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడిని చివరిసారి చూసుకునేందుకు తరలివచ్చారు. గురువారం ఉదయం 11 గంటలకు బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ ఆవరణలో పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. అజిత్ పవార్ రాజకీయాలకు అతీతంగా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో, విపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. ఆయన మరణానికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించింది.
అత్యంత భద్రత ఉండే వీఐపీ విమానం ఎలా కూలిపోయింది? అనే కోణంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. బారామతి ఎయిర్స్ట్రిప్లో సరైన నావిగేషన్ సదుపాయాలు లేకపోవడమే ప్రమాదానికి కారణమా? లేక విమానంలో సాంకేతిక లోపం ఉందా? అనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. విమాన ప్రమాదంలో ప్రభావవంతమైన ప్రజాప్రతినిధి మరణించినప్పుడు నిబంధనల ప్రకారం సీఐడీ కూడా ప్రత్యేక విచారణ జరుపుతోంది.
శరద్ పవార్ మేనల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు అజిత్ పవార్. బారామతి నియోజకవర్గం నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం. ముక్కుసూటిగా మాట్లాడటం, పరిపాలనలో కఠినంగా ఉండటం ఆయన ప్రత్యేకత. ఇటీవల తన బాబాయ్ శరద్ పవార్తో విభేదించి ఎన్సీపీని చీల్చినప్పటికీ, బారామతి ప్రజలు ఆయనపై ఉన్న అభిమానాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




