యూపీలో పాఠశాల విద్యార్థులు దినపత్రిక తప్పక చదవాలి

యూపీలో పాఠశాల విద్యార్థులు దినపత్రిక తప్పక చదవాలి
x
Highlights

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ లోని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

లక్నో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ లోని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులు ప్రతిరోజూ తప్పనిసరిగా న్యూస్‌పేపర్లు చదవాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కాలంలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల వంటి డిజిటల్ పరికరాలకు ఎక్కువగా అలవాటు పడిపోతున్నారని, దీనివల్ల వారి కంటి చూపు దెబ్బతినడమే కాకుండా ఏకాగ్రత కూడా తగ్గుతోందని ప్రభుత్వం భావించింది. ఈ డిజిటల్ ‘స్క్రీన్ టైమ్’ను తగ్గించి, అక్షర జ్ఞానాన్ని, భాషా నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో జ్ఞానం పెంపొందించాలంటే కనీసం 10 నిమిషాలు పత్రికా పఠనం చేయాలని ఉత్తర్వులులో పేర్కొన్నారు.

ఈ నూతన నిబంధన ప్రకారం, ప్రతిరోజూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే విద్యార్థులందరూ కనీసం 10 నిమిషాలు వార్తాపత్రికలను చదవాలి. ఇది కేవలం మొక్కుబడి పఠనంలా కాకుండా, విద్యార్థులకు సమాజంపై అవగాహన కలిగించేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ఎడిటోరియల్ (సంపాదకీయ) వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, క్రీడలు, ప్రధాన వార్తలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల విద్యార్థులకు భాషపై పట్టు పెరగడమే కాకుండా, తాజా రాజకీయ, సామాజిక పరిణామాలను విశ్లేషించే శక్తి లభిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వార్తాపత్రికల పఠనం వల్ల విద్యార్థుల్లో జనరల్ నాలెడ్జ్ మెరుగుపడటంతో పాటు, వారిలో లోతైన ఆలోచనా దృక్పథం పెరుగుతుందని యూపీ ప్రభుత్వం ఆశిస్తోంది. ఎడిటోరియల్ పేజీలను చదవడం ద్వారా సంక్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం, సొంతంగా అభిప్రాయాలను వ్యక్తం చేసే నైపుణ్యం అలవడతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు బయటి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక కానుంది. పుస్తకాల్లోని చదువుతో పాటు సమాజపు పోకడలను తెలుసుకోవడం వల్ల విద్యార్థులు భావి భారత పౌరులుగా తయారవుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories