Supreme Court: 65 రోజుల కాపురానికి 40 కేసులు.. 13 ఏళ్ల పోరాటం! ఆ జంట తీరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


కేవలం 65 రోజులు కలిసి ఉండి, 13 ఏళ్లుగా 40 కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జంటపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూనే జరిమానా విధించిన ధర్మాసనం, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది.
"అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం!" అని న్యాయస్థానమే విస్తుపోయేలా చేసిందో జంట. కేవలం 65 రోజులు కూడా కలిసి ఉండని ఆ దంపతులు.. ఏకంగా 13 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరిపై ఒకరు ఏకంగా 40కి పైగా కేసులు పెట్టుకుని న్యాయవ్యవస్థ సమయాన్ని వృధా చేసిన ఈ జంటపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూనే, కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
అసలేం జరిగింది? (65 Days vs 13 Years)
ఈ వింత వివాదం 2012 జనవరిలో మొదలైంది. ఒక జంటకు అట్టహాసంగా వివాహం జరిగింది. కానీ, ఏమైందో ఏమో గానీ, పెళ్లయిన కేవలం 65 రోజులకే భార్య తన భర్త, అతని కుటుంబ సభ్యులపై వేధింపుల ఆరోపణలు చేస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఈ జంట మధ్య మొదలైన 'ఈగో' వార్ ఢిల్లీ, యూపీలోని పలు కోర్టులను చుట్టేసింది.
కేసుల సునామీ: ఒకరిపై ఒకరు ఏకంగా 40కి పైగా సివిల్, క్రిమినల్ కేసులు పెట్టుకున్నారు.
దశాబ్ద కాలం పైగా పోరాటం: పెళ్లయిన 65 రోజులు అయితే, కోర్టుల్లో గడిపింది మాత్రం 13 ఏళ్లు.
న్యాయవ్యవస్థను ఆటస్థలంగా మార్చొద్దు: సుప్రీంకోర్టు ఆగ్రహం
జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
"న్యాయ వ్యవస్థ అంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకునే యుద్ధభూమి కాదు. ఇలాంటి ప్రతీకార వ్యాజ్యాల వల్ల ఇప్పటికే భారంతో ఉన్న కోర్టులపై మరింత ఒత్తిడి పెరుగుతోంది."
కోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పు:
జరిమానా: కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను భార్యాభర్తలు ఇద్దరికీ చెరో రూ. 10,000 జరిమానా విధించింది.
విడాకులు మంజూరు: ఆర్టికల్ 142 కింద తమకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి, ఈ వివాహ బంధాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
శాశ్వత నిషేధం: భవిష్యత్తులో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎలాంటి కేసులు వేయకూడదని కోర్టు శాశ్వత నిషేధం విధించింది.
మధ్యవర్తిత్వమే మేలు!
వైవాహిక వివాదాలు మొదలైనప్పుడే పెద్దల సమక్షంలో లేదా మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. బంధం పునరుద్ధరించలేని స్థితికి చేరుకున్నప్పుడు, దాన్ని సాగదీసి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



