Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య: పితృ దోషాలు తొలగి, వంశాభివృద్ధి కలగాలంటే ఈ దానాలు తప్పనిసరి!


Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య: పితృ దోషాలు తొలగి, వంశాభివృద్ధి కలగాలంటే ఈ దానాలు తప్పనిసరి!
Mahalaya Amavasya 2025: ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన రానున్న మహాలయ అమావాస్య, ఆదివారం కలిసి రావడం మరింత విశేషమని పండితులు పేర్కొంటున్నారు.
Mahalaya Amavasya 2025: సంవత్సరంలో వచ్చే అన్ని అమావాస్యలలో మహాలయ అమావాస్యకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇది పితృదేవతల ప్రీతి కోసం ఉద్దేశించబడింది. వంశాభివృద్ధి కలగాలన్నా, పితృ దోషాలు తొలగిపోవాలన్నా ఈ రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు, దానధర్మాలు తప్పక పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన రానున్న మహాలయ అమావాస్య, ఆదివారం కలిసి రావడం మరింత విశేషమని పండితులు పేర్కొంటున్నారు.
మహాలయ అమావాస్య ఎందుకు ప్రత్యేకమంటే..?
మహాలయం అంటే పితృదేవతలను ఆరాధించే ప్రదేశం. తెలుగు పంచాంగం ప్రకారం, ఏడాదిలోని అన్ని అమావాస్యలు పితృదేవతలకు ముఖ్యమైనవే అయినప్పటికీ, భాద్రపద బహుళ అమావాస్య అయిన మహాలయ అమావాస్య రోజున మరణించిన పూర్వీకులకు సద్గతులు కలిగించడం కోసం తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఇతర అమావాస్యల రోజున తర్పణాలు వదలకపోయినా, ఈ రోజున మాత్రం తప్పకుండా చేయాలని సూచిస్తుంది.
మహాలయ అమావాస్య నాడు ఏం చేయాలి?
సమయం: పితృదేవతలకు చేసే పూజలు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. ఈ సమయంలోనే పూర్వీకులకు తర్పణాలు విడిచి పెట్టాల్సి ఉంటుంది.
మంత్రయుక్త తర్పణాలు: నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు మంత్రపూర్వకంగా తర్పణాలు వదలాలి. వేద పండితుల ఆధ్వర్యంలో నువ్వులతో హోమం చేయడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి.
సూర్య ఆరాధన: ఈ రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలాన్ని ఇస్తుంది. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా ఏడాది మొత్తం పితృ కర్మలు చేయని దోషాలు తొలగిపోతాయి.
గాయత్రీ జపం: ఈ రోజు విశేషంగా గాయత్రీ జపం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
పితృ రుణం తీర్చుకునే మార్గాలు
గరుడ పురాణం ప్రకారం, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ దేవ రుణం, రుషి రుణం, మరియు పితృ రుణం అనే మూడు రుణాలను తప్పక తీర్చుకోవాలి. పూర్వీకులకు ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, అమావాస్యలకు తర్పణాలు వదలడం, వారి పేరు మీద దానధర్మాలు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకోవచ్చు. ముఖ్యంగా, మహాలయ అమావాస్య రోజు చేసే తర్పణాలు, శ్రాద్ధ కర్మల వలన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని శాస్త్ర వచనం.
మహాలయ అమావాస్య రోజున చేయవలసిన దానాలు
మహాలయ అమావాస్య రోజున చేసే దానాల వలన వంశాభివృద్ధి జరుగుతుందని చెబుతారు. అంటే వారి వంశంలో ఎవరికీ కూడా సంతానం లేకపోవడం వంటి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
♦ బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్ర దానం చేయాలి. శక్తి ఉన్నవారు సువర్ణ దానం, గోదానం, భూదానం కూడా చేయవచ్చు.
♦ ఈ రోజు బ్రాహ్మణునికి ఎర్ర గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది.
♦ జాతకంలో రాహు, కేతు దోషాలతో బాధపడేవారు మహాలయ అమావాస్య రోజున నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
ఈ రోజు పాటించాల్సిన నియమాలు
నిషిద్ధం: ఉల్లిపాయలు, వెల్లుల్లి, మద్యమాంసాలు తినడం నిషిద్ధం. ఈ రోజున బ్రహ్మచర్యం తప్పనిసరి.
శుభ శకునాలు: పితృదేవతల ప్రతినిధిగా భావించే కాకికి ఆహారం పెట్టాలి. ఆవుకు గ్రాసం అందించాలి. అబద్ధాలు చెప్పకూడదు.
ఈ మహాలయ అమావాస్య రోజున శాస్త్రంలో చెప్పినట్లుగా పితృదేవతలను ఆరాధించి, సకల శుభాలను పొందుదాం!
(గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.)

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire