Asia Cup 2025: పాకిస్థాన్‌ను ఓడించి 9వ సారి కప్ గెలిచిన టీమిండియా!

Asia Cup 2025: పాకిస్థాన్‌ను ఓడించి 9వ సారి కప్ గెలిచిన టీమిండియా!
x
Highlights

Asia Cup 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి.

Asia Cup 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. టోర్నమెంట్ అంతటా పాకిస్థాన్‌పై టీమిండియా ఏ విధంగా ఆధిపత్యం చెలాయించిందో, అదే విధంగా ఫైనల్ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో టీమిండియా రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని ఎగురవేసింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 5 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో గెలుపొందింది.

సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ తరపున ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ దూకుడుగా ఆడి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఫర్హాన్ మరోసారి జస్ప్రీత్ బుమ్రాను లక్ష్యంగా చేసుకుని కేవలం 38 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఫర్హాన్, ఫఖర్ మొదటి వికెట్‌కు 84 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత ఫఖర్ జమాన్ బాధ్యతాయుతమైన ఆటతో జట్టును 100 పరుగుల మార్కు దాటించాడు.

అయితే, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మ్యాచ్ మొత్తం స్వరూపం మారిపోయింది. 13వ ఓవర్లో కుల్దీప్, సాయిమ్ అయూబ్‌ను అవుట్ చేశాడు. దీంతో పాకిస్థాన్ 113 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి పాకిస్థాన్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. 17వ ఓవర్లో కుల్దీప్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌కి ముందు, టీమిండియా గ్రూప్ దశ, సూపర్ 4 రౌండ్లలో పాకిస్థాన్‌ను ఏకపక్షంగా ఓడించింది. దీనికి ప్రధాన కారణం ఓపెనర్ అభిషేక్ శర్మ, అతను రెండు మ్యాచ్‌లలోనూ మెరుపు ఆరంభాలు అందించి జట్టును సులభంగా గెలుపు తీరాలకు చేర్చాడు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ రెండో ఓవర్‌లోనే అవుట్ అయి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తమ పేలవమైన ఫామ్‌ను కొనసాగించారు. దీంతో జట్టు కేవలం 20 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో సంజు శాంసన్, తిలక్ వర్మ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది 57 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు.

సంతూ శాంసన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, తిలక్‌కు మద్దతుగా నిలిచి జట్టును గెలుపు అంచులకు చేర్చారు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 40 బంతుల్లో 60 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. ఈ సమయంలో, తిలక్ తన పోరాట అర్ధశతకాన్ని పూర్తి చేసి జట్టుకు గోడలా నిలిచాడు. 19వ ఓవర్ చివరి బంతికి దూబే అవుట్ కావడంతో భారత్‌కు చివరి ఆరు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌లో తిలక్, హారిస్ రౌఫ్ వేసిన రెండో బంతికి సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆ తర్వాత స్ట్రైక్‌కి వచ్చిన రింకూ సింగ్ నాలుగో బంతికి బౌండరీ బాది జట్టుకు రోమాంచక విజయాన్ని అందించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories