Team India Heroes: భారత్ ను విశ్వవిజేతను చేసిన హీరోలు వీరే..

Team India Heroes: వరుసగా రెండోసారి విశ్వవిజేతగా టీమిండియా నిలవడం వెనుక హీరోలు కొందరు ఉన్నారు. ఆ వివరాలు ఇవే..
x

Team India Heroes

Highlights

Team India Heroes: వరుసగా రెండోసారి విశ్వవిజేతగా టీమిండియా నిలవడం వెనుక హీరోలు కొందరు ఉన్నారు. ఆ వివరాలు ఇవే..

Team India Heroes: టీమిండియా T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని వరుసగా రెండోసారి విశ్వవిజేత అయింది. అహ్మదాబాద్ లో ఆదివారం రాత్రి జరిగిన మ్ ఫైనల్స్ లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది భారత్. క్రికెట్ టీమ్ గేమ్. టీమ్ లో అందరూ సమన్వయంతో ఆడితేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అయితే,కొంతమంది ప్లేయర్స్ ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్ లో నిలకడగా రాణించడం.. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు అద్భుతాలు చేయడం ద్వారా హీరోలుగా నిలుస్తారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో కూడా టీమిండియా గెలిచిన ప్రతి మ్యాచ్ లోనూ టీమ్ స్పిరిట్ కనిపించింది. ప్రత్యేకంగా ఫైనల్ మ్యాచ్ లో టీమంతా.. కసిగా.. కూల్ గా ఆడి విశ్వవిజేతగా భారత్ నిలిచేలా చేశారు. అయితే, టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించడమే కాకుండా ముఖ్యమైన మ్యాచుల్లో కీలకపాత్ర పోషించి భారత్ ను విజయాల దారిలో నిలిపిన వారు కొందరున్నారు. వారెవరో చూద్దాం..

భారత్ ను విశ్వ విజేతగా నిలిపిన హీరోలు..

సంజూ సామ్సన్..

ఈ టోర్నీలో కేరళ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్ భారత్ ట్రంప్ కార్డ్ గా నిలిచాడు. అతను తాను ఆడిన అన్ని మ్యాచ్‌లలో వేగవంతంగా హాఫ్ సెంచరీలు చేశాడు లీగ్ దశలో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు సంపాదించుకోవడానికే కష్టాలు పడ్డ సంజూ, కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అవకాశం పొందాడు.

సవాలుతో కూడిన బ్యాటింగ్ పిచ్‌పై సామ్సన్ అజేయంగా 97 పరుగులు చేసి భారత్ పోరాడగలిగే స్కోరును చేరుకోవడంలో సహాయపడ్డాడు. తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 89 పరుగులు - న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 89 పరుగులు చేశాడు. అతను టోర్నమెంట్‌లో టీమిండియా నుంచి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.

బూమ్..బూమ్..బుమ్రా..

జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అతను నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, ఎనిమిది మ్యాచ్ లలో 14 వికెట్లు పడగొట్టి, టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.

బుమ్రా కచ్చితమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో భారత్ విజయం సాధించింది. గురువారం 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ఇంగ్లాండ్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఒక దశలో మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా సాగుతున్నట్లు అనిపించింది, కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతిని జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని.. టీమిండియా అభిమానుల ఆశల్ని నిలబెట్టాడు బుమ్రా. మిడిల్ ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 14 పరుగులు ఇచ్చి ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచాడు. అక్కడి నుంచి భారత్ 7 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి ఫైనల్స్ కు వచ్చింది. ఇక ఫైనల్స్ లో బుమ్రా అద్భుతమే చేశాడు. న్యూజిలాండ్ ను చావుదెబ్బ కొట్టాడు.

ఇషాన్ కిషన్ మెరుపులు..

టీ20 ప్రపంచ కప్ కు ముందు చివరి నిమిషంలో జట్టులోకి ఎంపికైన ఓపెనర్ ఇషాన్ కిషన్, టోర్నమెంట్ లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ లో, అతను 21 బాల్స్ లో 247.61 స్ట్రైక్ రేట్ తో 52 పరుగులు చేశాడు. కిషన్ 48 బంతుల్లో సంజు సామ్సన్ తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అంతకుముందు, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు, కానీ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం జట్టు 175 పరుగుల స్కోరును చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ 77 పరుగులు చేశాడు.

నమీబియాపై కూడా ఇషాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంమీద ఇషాన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో 193.29 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను భారతదేశం తరపున రెండవ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.

హార్దిక్ అల్రౌండ్ పెరఫార్మెన్స్

హార్దిక్ పాండ్యా ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగ రాణించాడు. అతను తొమ్మిది మ్యాచ్‌ల్లో 217 పరుగులు చేశాడు, అందులో ఒక ఫిఫ్టీ కూడా ఉంది. హార్దిక్ స్ట్రైక్ రేట్ , 160.74. ఇక బౌలింగ్లో పాండ్యా తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాడు. అతను 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్‌తో 27 పరుగులు చేసి, భారత్ 250 పరుగుల మార్కును దాటడంలో సహాయపడ్డాడు. అతను బౌలింగ్ వేసిన మొదటి బంతికే ఫిల్ సాల్ట్‌ను అవుట్ చేశాడు. 19వ ఓవర్‌లో అతను కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి విజయాన్ని ఖాయం చేశాడు.

ఫైనల్లో శివమెత్తిన దూబే

చివరి మ్యాచ్‌లో భారత్ 15 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఆ తర్వాత జిమ్మీ నీషమ్ 16వ ఓవర్‌లో సంజు సామ్సన్ (89), ఇషాన్ కిషన్ (52), సూర్యకుమార్ యాదవ్ (0)లను వరుసగా అవుట్ చేశాడు. ఆ తర్వాతి 24 బంతుల్లో 28 పరుగులు మాత్రమే వచ్చాయి. అప్పుడు భారత్ 250 పరుగులు కూడా చేరుకోవడం కష్టం అనిపించింది.

సరిగ్గా అప్పుడు వచ్చాడు శివమ్ దూబే.. జిమ్మీ నీషమ్ వేసిన ఓవర్లో శివమ్ దూబే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. కేవలం ఎనిమిది బంతుల్లోనే 26 పరుగులు చేసి టీమిండియా ఫైనల్లో 255 పరుగులు సాధించడంలో సహాయపడ్డాడు. అంతకు ముందు సెమీఫైనల్లో కూడా ఇంగ్లాండ్‌పై 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

మొత్తమ్మీద టీమిండియా రికార్డ్ స్థాయిలో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. ఈ విజయంలో ఈ ఐదుగురు హీరోలుగా నిలిచారనడంలో సందేహం అక్కర్లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories