
Ranji Trophy: రంజీ ట్రోఫీలో రికార్డు.. ఒకే జట్టులో 4 సెంచరీలు.. రాజస్థాన్ స్కోర్ ఎంతో తెలుసా?
దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లలో ఒకటైన రంజీ ట్రోఫీ 2025-26 లో అద్భుతాలు జరుగుతున్నాయి.
Ranji Trophy: దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లలో ఒకటైన రంజీ ట్రోఫీ 2025-26 లో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. రాజ్సమంద్ లోని మదన్ పాలివాల్ మిరాజ్ స్పోర్ట్స్ సెంటర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రెండు రోజులు పూర్తిగా రాజస్థాన్ ఆధిపత్యంలోనే సాగాయి. అందుకు కారణం.. రాజస్థాన్ బ్యాట్స్మెన్ల ఊహించని మెరుపు ప్రదర్శన. ఒకరి తర్వాత ఒకరుగా ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్లు సెంచరీలు బాది.. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏకంగా 570 పరుగుల భారీ స్కోరు సాధించిన రాజస్థాన్ బ్యాటింగ్ ప్రదర్శన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కానీ, ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా తప్పని తేలింది. మ్యాచ్ ప్రారంభంలో రాజస్థాన్ జట్టుకు తొలి రెండు వికెట్లు కేవలం 41 పరుగులకే కోల్పోయింది. దీంతో ఢిల్లీ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్లు.. ఢిల్లీ బౌలర్ల ఆశలను ఆవిరి చేశారు.
సచిన్ యాదవ్, కునాల్ సింగ్ రాథోడ్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సచిన్ యాదవ్ 257 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 130 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు కునాల్ సింగ్ రాథోడ్ 198 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో 102 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఢిల్లీ బౌలర్లకు కోలుకోలేని దెబ్బ తీశారు.
సచిన్ యాదవ్, కునాల్ సింగ్ రాథోడ్ సెంచరీలు చేసిన తర్వాత, స్టార్ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్ తన దూకుడు చూపించాడు. 229 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 128 పరుగులు (నాటౌట్) చేశాడు. ఈ ముగ్గురి సెంచరీలతోనే రాజస్థాన్ భారీ స్కోరు దిశగా దూసుకుపోయింది.
అయితే 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కార్తీక్ శర్మ ఆడింది మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్. కేవలం 154 బంతుల్లో 5 ఫోర్లు, 9 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగుల స్కోరు చేసి, జట్టు స్కోరును మరింత పెంచాడు. ఈ నలుగురు బ్యాట్స్మెన్ల అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ను 7 వికెట్ల నష్టానికి 570 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.
రాజస్థాన్ బ్యాట్స్మెన్ల సునామీ ముందు ఢిల్లీ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. ఢిల్లీ తరపున సిమర్జీత్ సింగ్ మాత్రమే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ 2 వికెట్లు తీశాడు. సిద్ధాంత్ శర్మ, సుమిత్ మాథూర్ చెరో 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. 161 ఓవర్లు బౌలింగ్ చేసినా.. ఢిల్లీ బౌలర్లు రాజస్థాన్ బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు 570 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




