
T20 World Cup 2026 :టి20 వరల్డ్ కప్ 2026 హోస్ట్ ఎవరు? ఇండియాలో ఎన్ని మ్యాచ్లు.. లంకలో ఎన్ని?
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ 2026 వేదికల గురించి ఇప్పుడు ఒక స్పష్టత వచ్చేసింది.
T20 World Cup 2026 : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ 2026 వేదికల గురించి ఇప్పుడు ఒక స్పష్టత వచ్చేసింది. చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే.. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశం భారతా లేక శ్రీలంకనా? అసలు మ్యాచ్లు ఎక్కడెక్కడ జరుగుతాయి? కేవలం పాకిస్తాన్ మ్యాచ్లు మాత్రమే శ్రీలంకలో ఉంటాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టి20 వరల్డ్ కప్ 2026కు భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఇది హైబ్రిడ్ మోడల్ కాదు, ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్న టోర్నీ. భారత్లోని ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్లు జరగనుండగా.. శ్రీలంకలోని కొలంబో, క్యాండీ వేదికలుగా మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తారు. మొత్తం 20 టీమ్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఈ క్రికెట్ పండగలో పాల్గొంటాయి.
చాలా మంది పాకిస్తాన్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా ఆ జట్టు మ్యాచ్లు మాత్రమే శ్రీలంకలో జరుగుతాయని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. లంక వేదికగా ఆతిథ్య జట్టు శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే వంటి జట్లు కూడా తమ లీగ్ మ్యాచ్లను అక్కడ ఆడబోతున్నాయి. అంతేకాదు, భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత సూపర్-8 మ్యాచ్లకు కూడా శ్రీలంక వేదిక కానుంది.
సెమీఫైనల్, ఫైనల్ వేదికల విషయంలో ఐసీసీ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ జట్టు గనుక సెమీఫైనల్ లేదా ఫైనల్కు క్వాలిఫై అయితే, ఆ మ్యాచ్లను శ్రీలంకలోని కొలంబోలో నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్తాన్ రేసులో లేకపోతే, రెండు సెమీఫైనల్స్ భారత్లోని కోల్కతా, ముంబైలలో జరుగుతాయి. గ్రాండ్ ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. అంటే ఫైనల్ ఎక్కడ జరగాలనేది పాక్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉందన్నమాట.
టోర్నీ ఫార్మాట్ - గ్రూప్ వివరాలు: మొత్తం 20 జట్లను ఐదు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా.
గ్రూప్ బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్.
గ్రూప్ సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ డి: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ. తొలిరోజు (ఫిబ్రవరి 7) మూడు మ్యాచ్లు జరగనున్నాయి. భారత్ తన తొలి పోరులో యూఎస్ఏతో తలపడనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




