
Telangana: తెలంగాణలో మరో సరికొత్త పథకం.. వీరు అర్హులు.. అనర్హులు వీరే..!
Telangana: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ప్రజాపాల్గొనే నమూనాను ఆదర్శంగా తీసుకుని, రాష్ట్రంలోని అతి పేద కుటుంబాలను గుర్తించే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించింది. ఈ ప్రక్రియలో అధికారులకే కాకుండా గ్రామస్తుల భాగస్వామ్యాన్ని కూడా కీలకంగా మారుస్తూ, నిజంగా సహాయం అవసరమైన వారికే ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు చేపడుతోంది.
ఈ గుర్తింపు ప్రక్రియ పూర్తిగా క్షేత్రస్థాయిలో సాగుతుంది. గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు ప్రతి వీధిని సందర్శించి, అక్కడ నివసించే కుటుంబాల జీవన పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తారు. ఇళ్ల నిర్మాణ స్వరూపం ఆధారంగా పక్కా ఇల్లు, రేకుల గది లేదా గుడిసె వంటి వర్గీకరణ చేస్తూ గ్రామానికి సంబంధించిన ఒక సామాజిక చిత్రపటాన్ని రూపొందిస్తారు. ఈ వివరాలన్నింటిని గ్రామ ప్రజల సమక్షంలో చర్చించి, అందరి అంగీకారంతో ఒక ప్రాథమిక జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు ఈ జాబితాను మరోసారి పరిశీలించి, అన్ని ప్రమాణాలు తీరిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు. ఈ విధానం ద్వారా అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కుటుంబాలు, ముఖ్యంగా ఆదిమ తెగలు, సొంత ఇల్లు లేదా స్థలం లేని వారు, చిన్న మట్టి గదుల్లో జీవిస్తున్న కుటుంబాలు, రోజువారీ కూలీపై ఆధారపడేవారు, సాగు భూమి లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. అలాగే ఒంటరి మహిళలు, ఆధారంలేని వృద్ధులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, పని చేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు కూడా అర్హుల జాబితాలో ఉంటారు.
అయితే పథకం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కొన్ని కఠిన నియమాలను కూడా విధించింది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి ఉన్నా, నెలకు రూ.10 వేలకంటే ఎక్కువ స్థిర ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులు. అలాగే ట్రాక్టర్, జీపు వంటి వాహనాలు కలిగి ఉన్నవారు, 2.5 ఎకరాలకంటే ఎక్కువ సాగుభూమి లేదా సొంత బోర్ బావి ఉన్నవారు, బ్యాంకుల నుంచి రూ.50 వేలకంటే ఎక్కువ రుణం తీసుకున్న కుటుంబాలను కూడా అనర్హులుగా పేర్కొన్నారు.
ఈ సర్వే ద్వారా గుర్తించబడే సుమారు ఎనిమిది వేలకుపైగా కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, దీర్ఘకాలికంగా స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




