Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్లో కీలకంగా పోలింగ్ శాతం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం ఈసారి కీలకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ శాతం ఈసారి కీలకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే నగరంలోని నియోజకవర్గాల్లో ఎప్పుడూ ఓటింగ్శాతం తక్కువగానే నమోదవుతూ వస్తోంది. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ సీన్రిపీట్కాకుండా ఉండేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 48.42 శాతం పోలింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవడం సాధారణమే అయినా.. జూబ్లీహిల్స్లో మరీ 50 శాతానికంటే తక్కువ నమోదవడం ఆశ్చర్యపరిచింది. దీంతో.. ఈసారి ఎలాగైనా 60 శాతం పోలింగ్ మార్క్ రీచ్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నారు అధికారులు.
2009లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 52.77 శాతం పోలింగ్ నమోదైంది. అప్పుడు ఓటర్లు 2 లక్షల 59 వేల 416 మంది ఉండగా.. లక్షా 36 వేల 893 ఓట్లు పోలయ్యాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు 3 లక్షల 29 వేల 522 మంది ఉండగా.. లక్షా 65 వేల 368 ఓట్లు పోలయ్యాయి. 50.18 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, 2018 ఎన్నికల్లో ఒక్కసారిగా 45.59 శాతానికి తగ్గింది. ఆ ఎన్నికలప్పుడు 3 లక్షల 41 వేల 537 మంది ఓటర్లుండగా, లక్షా 55 వేల 729 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 లక్షల 75 వేల 430 ఓటర్లకు గాను.. లక్షా 83 వేల 312 మంది ఓట్లు పోలయ్యాయి. అప్పుడు 48.42 శాతం నమోదైంది. ప్రస్తుతం జరగనున్న బై పోల్ లో ఓటర్ల సంఖ్య 4 లక్షల 13 వందల 65 కాగా, ఇందులో పురుషులు 2 లక్షల 8 వేల 561 మంది, మహిళలు లక్షా 92 వేల 779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. దీంతో.. గత ఎన్నికల కంటే సుమారు 25వేల మంది ఓటర్లు పెరగడంతో ఈ సారి పోలింగ్ పర్సంటేజీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.
అయితే.. ఈ పర్సంటేజ్ అనేది పోలింగ్ జరిగే రోజును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆదివారం రోజున పోలింగ్ ప్రక్రియ జరిగితే.. ప్రజలు ఎక్కువగా పోలింగ్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. కానీ, ఈ సారి మంగళవారం రోజున పోలింగ్ జరుగుతుండటంతో ఉద్యోగులు, వ్యాపారవేత్తలు వంటి వర్గాలు ఓటు వేయడానికి పెద్దఎత్తున పోలింగ్ బూత్లకు తరలివస్తారా..? అనేది పెద్ద ప్రశ్న. అయితే.. ఇప్పటికే పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు.. గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీలకు వేతనంతో కూడిన సెలవును అధికారులు ప్రకటించారు. అయితే.. చాలామంది పోలింగ్ డేను హాలిడేగా ట్రీట్ చేస్తున్నారు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం లేదా ఊర్లకు పోయేందుకు వినియోగిస్తున్నారు. దీంతో పోలింగ్ బూత్ దాకా వచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికొస్తే.. ఇక్కడ క్లాస్, మాస్ రెండువర్గాల ప్రజలున్నారు. ఓ వైపున సంపన్నులుంటే.. మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు. అయితే.. స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాల ప్రజలే ఎక్కువ శాతం పోలింగ్లో పాల్గొంటున్నారు గత సర్వేలు చెబుతున్నాయి. దీంతో ప్రతిఒక్కరినీ పోలింగ్ బూత్కు రప్పించేలా.. ఆయా పార్టీల నాయకులు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



