‘మ‌హాల‌క్ష్మి’తో లాభాల్లోకి ఆర్టీసీ : భ‌ట్టి విక్ర‌మార్క‌

‘మ‌హాల‌క్ష్మి’తో లాభాల్లోకి ఆర్టీసీ : భ‌ట్టి విక్ర‌మార్క‌
x
Highlights

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీ లాభాల్లోకి వ‌చ్చింద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. అదే విధంగా ప్రజాప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ హాస్టళ్ల‌లోని నిరుపేద విద్యార్థుల‌కు కాస్మోటిక్, మెస్ ఛార్జీల‌ను 200 శాతం పెంచామ‌న్నారు.

హైదరాబాద్: మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీ లాభాల్లోకి వ‌చ్చింద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. అదే విధంగా ప్రజాప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ హాస్టళ్ల‌లోని నిరుపేద విద్యార్థుల‌కు కాస్మోటిక్, మెస్ ఛార్జీల‌ను 200 శాతం పెంచామ‌న్నారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లుల‌ను చెల్లిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఆదివారం ప్ర‌జాభ‌వ‌న్ లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల‌తో ఉప ముఖ్య‌మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రితో పాటుగా మంత్రి పొన్నం ప్ర‌భాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజెపి కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసి బ‌లోపేతం చేసేందుకు, కార్మికుల‌ను ఆదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కీల‌క‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి అన్నారు. ముఖ్యంగా ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌స్సులో ఉచితంగా ప్ర‌యాణించేందుకు తీసుకువ‌చ్చిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల ఆర్టీసీ ల‌భాల్లోకి వ‌చ్చింద‌ని అన్నారు. అంతేగాక మ‌హిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవ‌డంతో పాటుగా, ప్ర‌భుత్వం అందించిన స‌హాకారంతో సంస్థ‌కు కొత్త బ‌స్సులు అందుబాటులోకి వచ్చాయ‌ని చెప్పారు. అంతేకాక బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి ప్ర‌జాప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హకారంతో పాటుగా సంస్థ స్వ‌త‌హాగా నూత‌నంగా ఆదాయా మార్గాల‌ను అన్వేషించాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఆర్టీసీలో మహాలక్ష్మీ ప‌థకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగాయి. మహాలక్ష్మీ పథకం వ‌ల్ల‌ మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నట్లు ఆయ‌న అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఆర్టీసీలో పీఎఫ్ బ‌కాయిలు రూ. 1400 కోట్లు ఉండ‌గా, ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌లో రూ. 660 కోట్లకు తగ్గించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అలాగే సీసీఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ప్ర‌జాప్ర‌భుత్వం వ‌చ్చాక‌, రూ.373 కోట్లకు తగ్గించినట్లు తెలిపారు.

ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గుడ్ గవర్నెస్ తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు ఆయ‌న‌ సూచించారు.ఆర్టీసీలో పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వీటికి చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పీఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఉప ముఖ్య‌మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories