Adilabad: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కలెక్టర్!
Adilabad: అదిలాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనపై కలెక్టర్ రాజర్షి షా కీలక ఆదేశాలు జారీ చేశారు.
Adilabad: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కలెక్టర్!
అదిలాబాద్: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేశామని, బాలురు, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, డైనింగ్ హాల్స్, తాగునీటి సదుపాయాలు వంటి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ వసతులు కల్పించి, వారిని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేర్చడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు, డైనింగ్ హాల్స్ వంటి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ప్యాకేజ్డ్ ఫుడ్స్ పూర్తిగా మానివేయాలని, ఇంటి వద్ద తయారుచేసిన ఆరోగ్యకరమైన భోజనం, మధ్యాహ్న భోజనం, రాగిజావను మాత్రమే తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు 'స్పోకెన్ ఇంగ్లీష్' కార్యక్రమాలను మరింత ప్రభావవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థుల మధ్య పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 'ఖాన్ అకాడమీ', 'కోడ్ మిత్ర' వంటి లెర్నింగ్ లాబ్స్, కంప్యూటర్ పీరియడ్స్, లైబ్రరీలను విద్యార్థులు విధిగా సద్వినియోగం చేసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు.




