Adilabad: కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్య
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ కొనుగోలు కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Adilabad: కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్య
Adilabad: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఒక జొన్న రైతు ఆవేదనతో ప్రాణాలు తీసుకున్నాడు. తన పంటను కొనుగోలు చేయడంలో జరిగిన ఆలస్యాన్ని తట్టుకోలేక, పొన్న గ్రామానికి చెందిన నుగురే పాండురంగ్ (48) అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎనిమిది ఎకరాల సొంత భూమి కలిగిన పాండురంగ్, ఈ ఏడాది జొన్న సాగు చేసి 35 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు. మే 23వ తేదీనే తన పంటను సిరికొండ మండల కేంద్రంలోని 'సిరిసంపద కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు.
అక్కడ అధికారులు పంటను తూకం వేసి, లాట్ నంబర్ కూడా కేటాయించారు. అయితే, రోజుల తరబడి ఎదురుచూసినా పంటను లోడ్ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కెట్ యార్డులోనే పురుగులమందు తాగాడు.
గమనించిన తోటి రైతులు వెంటనే స్పందించి రిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ వెల్లడించారు.




