Mancherial: మంచిర్యాలలో ఐలమ్మ వర్ధంతి.. కలెక్టరేట్లో ఘన నివాళి!
Mancherial: మంచిర్యాల కలెక్టరేట్లో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి ఘనంగా జరిగింది. కలెక్టర్ కుమార్ దీపక్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Mancherial: మంచిర్యాలలో ఐలమ్మ వర్ధంతి.. కలెక్టరేట్లో ఘన నివాళి!
మంచిర్యాల జిల్లా: సామాజిక అన్యాయాలు, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, వెనుకబడిన తరగతుల శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, కుల సంఘాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వెట్టి చాకిరీ, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె పోరాడి మహిళా చైతన్యానికి, సామాజిక న్యాయానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




