Gudihathnoor: గుడిహత్నూర్కు RTC షాక్: ప్రయాణికులకు తిప్పలు!
Gudihathnoor: గుడిహత్నూర్ బస్టాండ్కు బస్సులు రాక వెలవెలబోతోంది. జాతీయ రహదారి పనుల సాకుతో ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Gudihathnoor: గుడిహత్నూర్కు RTC షాక్: ప్రయాణికులకు తిప్పలు!
గుడిహత్నూర్కు RTC షాక్... బస్టాండ్ ఖాళీ...
నేషనల్ హైవే పనుల సాకుతో రూట్ మార్చిన ఆర్టీసీ...అవస్తలు పడుతున్న ప్రయాణికులు
గుడిహత్నూర్:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తర్వాత నిత్యం వేలాది మంది ప్రయాణికులతో, వందలాది బస్సులతో అత్యంత రద్దీగా, కళకళలాడే గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ నేడు దిక్కులేక వెలవెలబోతోంది. ఆర్టీసీ అధికారుల నిర్ణయాలు, నేషనల్ హైవే రోడ్డు మరమ్మతులు ప్రయాణికులకు శాపంగా మారాయి.
రోజుకు దాదాపు 250 నుంచి 300 బస్సులు వచ్చి పోయే ఈ బస్టాండ్కు ఇప్పుడు బస్సులు రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ బస్టాండ్లో ఒక సూచనా బోర్డును ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఉట్నూర్, కరీంనగర్, ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల వైపు వెళ్లే అన్ని బస్సులు జవాహర్ నగర్ ఎక్స్ రోడ్డు (గుడిహత్నూర్ అండర్ బ్రిడ్జ్) వద్ద నుండి మాత్రమే నడుపబడుతాయని, ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులందరూ జవాహర్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద మాత్రమే ఆగాలని ఆ బోర్డులో పేర్కొన్నారు.
అయితే జాతీయ రహదారి విస్తరణ పనుల వల్ల బస్సులు బస్టాండ్కు రావాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు, అంటే అప్ అండ్ డౌన్ కలిపి నాలుగు కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోందని అందుకే ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనివల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందనే కారణంతోనే బస్సులను నేరుగా హైవే మీదుగానే మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం నిర్మల్ వైపు నుంచి వచ్చే బస్సులు మాత్రమే బస్టాండ్ వరకు వస్తుండటంతో మిగతా రూట్ల ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఉట్నూర్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఆసిఫాబాద్ వైపు వెళ్లాల్సిన ప్రయాణికులు గుడిహత్నూర్ నుంచి జవాహర్ నగర్ X రోడ్డు వరకు అంటే దాదాపు ఒక కిలోమీటరు మేర కాలినడకన రాక తప్పడం లేదు. అలాగే ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే బస్సులు కూడా బస్టాండ్కు రాకుండా X రోడ్ నుండే వెళ్లిపోతున్నాయి. దీంతో ఉట్నూర్ వైపు నుండి వచ్చే ప్రయాణికులు X రోడ్డు వద్దే దిగిపోవాల్సి రావడం, అక్కడ నుండి ఆటోల్లోనో లేక కాలినడకనో గుడిహత్నూర్ చేరుకోవాల్సి వస్తోంది. చంటిపిల్లలు, వృద్ధులు, రోగులు ఆటోలను ఆశ్రయించి అదనపు భారాన్ని మోస్తున్నారు.
దీనికితోడు, ప్రయాణికులు వేచి X రోడ్డు (అండర్ బ్రిడ్జ్) వద్ద కనీసం తాత్కాలిక బస్ షెల్టర్ కూడా లేకపోవడం వారి అవస్థలను రెట్టింపు చేస్తోంది. ఎండలో, వర్షంలో రోడ్డు పక్కనే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రవాణా సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీ కేవలం బోర్డులు పెట్టి చేతులు దులుపుకుందే తప్ప ప్రయాణికుల కష్టాలను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.
వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేలా చర్యలు చేపట్టి, అన్ని ప్రాంతాల బస్సులు గుడిహత్నూర్ బస్టాండ్ వరకు వచ్చేలా చూడాలని, ప్రయాణికులకు ఈ నరకయాతన నుంచి విముక్తి కల్పించాలని ప్రయాణాలకు, మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.




