Nirmal: నిర్మల్ జిల్లాలో 112 చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీ
Nirmal: నిర్మల్ జిల్లాలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రూ.12.88 లక్షల విలువైన 112 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన ఎస్పీ జానకి షర్మిల.
Nirmal: నిర్మల్ జిల్లాలో 112 చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీ
నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేయడంలో నిర్మల్ జిల్లా పోలీసులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రికవరీ చేసిన సుమారు రూ.12 లక్షల 88 వేల విలువైన 112 సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ CEIR పోర్టల్ను సమర్థవంతంగా వినియోగిస్తూ జిల్లా పరిధిలో ఇప్పటివరకు మొత్తం 2377 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుత జీవన విధానంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అత్యంత కీలకమైన పరికరంగా మారిందని, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
బాధితులు స్వయంగా CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని, లేదా మొబైల్ ఫోన్కు సంబంధించిన వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలతో సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చని తెలిపారు. CEIR ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను బ్లాక్ చేయడంతో పాటు సాంకేతిక ఆధారాలతో గుర్తించి రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మార్కెట్లు, బస్టాండ్లు, బస్సులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రద్దీ సమయంలో మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు బిల్లు, IMEI నంబర్, ఫోన్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
సరైన ధ్రువీకరణ లేకుండా లేదా అనుమానాస్పదంగా విక్రయిస్తున్న మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.
మొబైల్ ఫోన్ల రికవరీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బంది, సంబంధిత పోలీసు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్తో పాటు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




