Komaram Bheem Asifabad: వంతెన వద్ద వరద పరిస్థితులు పరిశీలించిన ఎస్పీ నితికా పంత్!
Komaram Bheem Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెన్గంగ నది ఉధృతి నేపథ్యంలో వెంకట్రావుపేట వంతెన ప్రాంతంలో వరద పరిస్థితులను ఎస్పీ నితికా పంత్ పరిశీలించారు.
Komaram Bheem Asifabad: వంతెన వద్ద వరద పరిస్థితులు పరిశీలించిన ఎస్పీ నితికా పంత్!
Komaram Bheem Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్గంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన వెంకట్రావుపేట వంతెన, పారిగాం ప్రాంతాలను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు.
పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రోప్లు, లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
పెన్గంగ నది ఉధృతి పూర్తిగా తగ్గే వరకు వెంకట్రావుపేట వంతెన మీదుగా ప్రజలు, వాహనాల రాకపోకలను నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నదులు, వాగులు, లోతట్టు ప్రాంతాల వద్దకు ఎవరూ వెళ్లరాదని, సెల్ఫీల కోసం లేదా వరద నీటిని దగ్గరగా చూసేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట్ల పోలీసు సిబ్బందిని మోహరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు లేదా సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని కోరారు.




