Amaravati: ఏపీకి క్యూ కట్టిన పరిశ్రమలు.. రూ20 లక్షల కోట్ల పెట్టుబడులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోన రికార్డు స్థాయిలో 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు టి.జి. భరత్ వెల్లడించారు.
Amaravati: ఏపీకి క్యూ కట్టిన పరిశ్రమలు.. రూ20 లక్షల కోట్ల పెట్టుబడులు!
Amaravati: రాష్ట్రంలో ప్రభుత్వం మారితే అభివృద్ధి దిశ కూడా ఎలా మారుతుందో ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా నిలుస్తోందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. పరిశ్రమలు రావాలంటే కేవలం భూములు, రాయితీలు ఉంటే సరిపోదు... పెట్టుబడిదారుల్లో విశ్వాసం కూడా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం కల్పించిందని పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రానికి దేశీయ, విదేశీ పెట్టుబడులు భారీగా రావడం వెనుక పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చిన భరోసానే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
*రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. రికార్డు వైపు ఏపీ*
పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా రూ.7.66 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇప్పటికే ఆమోదం లభించింది. అనేక ప్రాజెక్టులు భూ కేటాయింపులు పూర్తి చేసుకుని గ్రౌండింగ్ దశలోకి అడుగుపెడుతున్నాయి. పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా భూమిపైకి రావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
*చంద్రబాబు బ్రాండ్.. పెట్టుబడిదారుల నమ్మకం*
ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్పై విశ్వాసం పెరగడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వమేనని మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు. దావోస్ నుంచి దుబాయ్ వరకు, ఢిల్లీ నుంచి ప్రపంచ పారిశ్రామిక వేదికల వరకు సీఎం స్వయంగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారని చెప్పారు. అదే కారణంగా గూగుల్, ఎల్జీ, ఆర్సెలార్ మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నాయని వివరించారు...
*ల్యాండ్ పాలసీలో విప్లవాత్మక మార్పులు*
గతంలో పరిశ్రమ కోసం చిన్న స్థలం కావాలన్నా నెలల తరబడి ఫైళ్లు తిరిగేవని ప్రభుత్వం విమర్శిస్తోంది. ఇప్పుడు 50 ఎకరాల లోపు భూ కేటాయింపులను నేరుగా ఏపీఐఐసీ ద్వారా ఆమోదించేలా విధానాన్ని సరళీకరించారు. దీంతో పరిశ్రమలకు భూములు త్వరగా కేటాయించే అవకాశం ఏర్పడింది. మరోవైపు భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకుండా నిలిపివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇప్పటికే 900 మందికి నోటీసులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
*175 నియోజకవర్గాలు.. 175 ఎంఎస్ఎంఈ పార్కులు*
పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని మంత్రి వివరించారు.
*20 లక్షల ఉద్యోగాలు.. రాజకీయ హామీ కాదు*
ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ కేవలం ఎన్నికల వాగ్దానం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి... ఎవరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయన్న వివరాలను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియ కూడా చేపట్టారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
*గ్రౌండ్ అవుతున్న మెగా ప్రాజెక్టులు*
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఎలక్ట్రానిక్స్ హబ్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, అనేక తయారీ పరిశ్రమలు వేగంగా అమలు దశలోకి వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఒప్పందాల దశ దాటిన అనేక ప్రాజెక్టులు నిర్మాణ పనులు ప్రారంభించాయని మంత్రి తెలిపారు.
*కొత్త పారిశ్రామిక విధానాలకు సిద్ధం*
రాష్ట్రాన్ని బొమ్మల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకురానున్నారు. అలాగే ఫర్నిచర్ తయారీ రంగాన్ని ప్రోత్సహించే ప్రత్యేక విధానం రూపొందుతోంది. భారీ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు ఆధునిక నివాస సౌకర్యాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్ హౌసింగ్ పాలసీ కూడా అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
*వ్యవసాయానికి విలువ జోడించే ఫుడ్ ప్రాసెసింగ్*
వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించకుండా రైతుల ఆదాయం పెరగదనే ఆలోచనతో ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై భారీగా దృష్టి పెట్టింది. "సీడ్ టు ప్లేట్" విధానంతో రైతు పండించిన పంట నుంచి వినియోగదారుడి భోజనపు పళ్లెం వరకు విలువ జోడించే వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
ఈ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే దాదాపు సగం మేర పెట్టుబడులు సాధించామని మంత్రి తెలిపారు.
*టమాటా నుంచి పనస వరకు.. కొత్త ప్రాసెసింగ్ యూనిట్లు*
కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. రైతులు టమాటాలను రోడ్డుపై పారబోసే పరిస్థితి లేకుండా కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.అనకాపల్లిలో పనసపండు, మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. తిరుపతి ఐఐటీ ఇన్క్యుబేషన్ సెంటర్లో మామిడి, టమాటా, సిట్రస్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు.
*కోకోలో దేశానికి ఏపీనే అగ్రగామి*
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కోకో బీన్స్లో సుమారు 50 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
*విశాఖ ఎకనామిక్ రీజియన్.. కొత్త అభివృద్ధి కేంద్రం*
విజన్-2047లో భాగంగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని మూడు ప్రధాన ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఎకనామిక్ రీజియన్లో 200 ఎకరాల్లో మూడు భారీ ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జేఎస్డబ్ల్యూ పార్క్లో కూడా మెగా యూనిట్ ఏర్పాటు కోసం చర్చలు కొనసాగుతున్నాయి.
*దుబాయ్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి*
ఆంధ్రప్రదేశ్ను గల్ఫ్ దేశాలకు ప్రధాన ఆహార సరఫరా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా 100 శాతం ఆహార దిగుమతులపై ఆధారపడే దుబాయ్ మార్కెట్ను లక్ష్యంగా పెట్టుకుని చర్చలు నిర్వహిస్తోంది. వరల్డ్ ఫుడ్ ఇండియాలో ఏపీ స్టాల్కు లభించిన స్పందన కూడా కొత్త అవకాశాలకు దారితీసిందని ప్రభుత్వం చెబుతోంది.
*అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండింగ్*
భౌగోళిక గుర్తింపు పొందిన అరకు కాఫీని ప్రపంచ మార్కెట్లో మరింత బలంగా నిలబెట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందుతోంది. గిరిజన రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మొత్తం విలువ శ్రేణిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
*నవంబర్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్*
ప్రపంచ పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ ఏడాది నవంబర్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నారు. దీనికి ముందు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కూడా భారీ రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించాలనే కార్యాచరణ సిద్ధమైంది.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు... ఈ మూడు అంశాల చుట్టూనే కూటమి ప్రభుత్వం తన అభివృద్ధి అజెండాను నిర్మించుకుంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు పూర్తిస్థాయిలో భూమిపైకి వస్తే రాష్ట్ర పారిశ్రామిక రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఒప్పందాల స్థాయి నుంచి ప్రాజెక్టులు ఎంత వేగంగా పూర్తవుతాయి, ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది, పెట్టుబడుల ప్రయోజనం గ్రామీణ యువత వరకు ఎలా చేరుతుంది అనే అంశాలే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పనితీరుకు అసలైన గీటురాయిగా మారనున్నాయి.




