ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థులకు పీవీఎన్ మాధవ్ అభినందనలు.. రాష్ట్ర స్వరం బలంగా వినిపిస్తారని ధీమా!
AP Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణలకు బీజేపీ రాష్ట్ర నేత పీవీఎన్ మాధవ్ అభినందనలు.
ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థులకు పీవీఎన్ మాధవ్ అభినందనలు.. రాష్ట్ర స్వరం బలంగా వినిపిస్తారని ధీమా!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీయే అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ అభినందనలు తెలియచేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచిన సానా సతీష్ బాబు,చింతకాయల విజయ్,భాష్యం రామకృష్ణ లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఎంపిక రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్డీయే కూటమి తరఫున ఎంపికైన ఈ నాయకులు వివిధ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రజా సేవ, వ్యాపార రంగం, పార్టీ కార్యకలాపాలు, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన వీరు రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సమర్థంగా గళం వినిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, కేంద్ర నిధులు వంటి అంశాలపై వీరు ప్రభావవంతంగా పని చేస్తారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ఎన్డీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని పీవీఎన్ మాధవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అందిస్తున్న సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్తగా ఎన్నిక కానున్న రాజ్యసభ సభ్యులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.అలాగే ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న ఐక్యత, సమన్వయానికి ఈ అభ్యర్థుల ఎంపిక నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక సమతుల్యత, అనుభవం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులందరూ విజయవంతంగా ఎన్నికై రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా పని చేయాలని ఆకాంక్షిస్తూ వారికి మరోసారి అభినందనలు తెలిపారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ స్వరం మరింత బలంగా వినిపించేలా ఈ నాయకులు కృషి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.




