Amaravati: సీడ్ యాక్సిస్ రోడ్డు పరిశీలించిన సీఎం చంద్రబాబు!
Amaravati: రోడ్డు పనులను స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. కరకట్టకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన రోడ్డు నిర్మాణంపై మంత్రి నారాయణకు ప్రత్యేక అభినందనలు.
Amaravati: సీడ్ యాక్సిస్ రోడ్డు పరిశీలించిన సీఎం చంద్రబాబు!
అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ఇన్నాళ్లూ రాజధాని ప్రాంతానికి రాకపోకలకు ప్రధాన ఆధారంగా ఉన్న ఇరుకైన కరకట్ట రోడ్డుకు ప్రత్యామ్నాయంగా సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతి రూపురేఖలు మరింత మారుతున్నాయి. ఈ కీలక ప్రాజెక్టును పూర్తి చేసిన పురపాలక శాఖ మంత్రి నారాయణ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డుపై ప్రయాణించారు. మార్గమధ్యంలో కాన్వాయ్ను ఆపి రహదారి నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. రోడ్డు నాణ్యత, నిర్మాణం, గ్రీనరీ, పరిసరాల అభివృద్ధిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధానికి వచ్చే ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభూతి కలిగేలా రహదారిని తీర్చిదిద్దిన తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో ఎదురైన సవాళ్లను వివరించారు. భూసేకరణ, నిర్మాణ పనుల్లో ఎదురైన అడ్డంకులు, వాటిని అధిగమించి పనులను వేగంగా పూర్తి చేసిన విధానాన్ని వివరించారు. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన కనెక్టివిటీ ప్రాజెక్టుగా సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాధాన్యతను కూడా వివరించారు.
అనంతరం సీఎం చంద్రబాబు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఫొటోలు దిగారు. అదే సమయంలో మంత్రి నారాయణను ప్రత్యేకంగా పిలుస్తూ.. “నారాయణ గారూ... ఇలా రండి” అంటూ తనతో కలిసి ఫొటో దిగాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి నారాయణను పిలిచి అభినందిస్తూ ఫొటో దిగడం అక్కడి వాతావరణాన్ని ప్రత్యేకంగా మార్చింది.
అమరావతి నిర్మాణంలో రహదారుల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ దృశ్యం నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు ఇరుకైన కరకట్ట రోడ్డుపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండగా.. ఇప్పుడు విశాలమైన సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో రాజధాని ప్రయాణం మరింత సులభం కానుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు, ప్రయాణ సమయానికి ఇక చెక్ పడనుంది.
రాజధాని నిర్మాణం ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదని.. ఒక్కో ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి వంటి మౌలిక వసతులు అమరావతి అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు.
“ఇకపై ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి” అంటూ మంత్రి నారాయణకు సీఎం సూచించారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంలో రహదారులు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు కీలకమని స్పష్టం చేశారు.
సీడ్ యాక్సిస్ రోడ్డుపై సీఎం-మంత్రి కలిసి దిగిన ఆ ఒక్క ఫొటో.. కేవలం ఒక అభినందన క్షణం మాత్రమే కాదు. అమరావతి నిర్మాణంలో పనులు వేగం పుంజుకున్నాయనే సందేశాన్ని ఇచ్చిన దృశ్యంగా నిలిచింది. కరకట్ట కష్టాలకు చెక్.. రాజధాని అభివృద్ధికి కొత్త కనెక్టివిటీ.. అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి.




