AP: ఇంటింటికీ తెలుగుదేశం-2026.. ప్రజల ముంగిటకు కూటమి పాలన!

AP: కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రగతిని వివరిస్తూ టీడీపీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం 19 రోజుల్లో 56.91 లక్షల కుటుంబాలను చేరింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 14 Aug 2026 6:51 PM IST
AP
X

AP: ఇంటింటికీ తెలుగుదేశం-2026.. ప్రజల ముంగిటకు కూటమి పాలన!

AP: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విస్తృతంగా సాగుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో పాటు.. వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి మార్గం చూపడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ఇంటింటి బాట పట్టాయి.

కార్యక్రమం ప్రారంభమైన 19 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 56.91 లక్షల కుటుంబాలను టీడీపీ కార్యకర్తలు సందర్శించారు. ప్రతిరోజూ సగటున మూడు లక్షలకు పైగా కుటుంబాలతో పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాయి. కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా.. ప్రజలతో నేరుగా మమేకమయ్యే వేదికగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ను నిర్వహిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలను ప్రతి కుటుంబానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉన్నారా? స్థానికంగా పరిష్కారం కావాల్సిన సమస్యలేమిటి? అనే అంశాలపై కార్యకర్తలు ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఇంటింటి పర్యటనల్లో ప్రజల నుంచి వస్తున్న సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించే ప్రయత్నంతో పాటు.. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లేలా టీడీపీ శ్రేణులు చర్యలు చేపడుతున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు మధ్య ప్రత్యక్ష అనుసంధానం మరింత బలోపేతమవుతోంది.

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో ప్రజలతో ముఖాముఖి సంభాషణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు వంటి స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల స్పందనను తెలుసుకోవడంతో పాటు.. పాలనలో మరింత మెరుగుదలకు అవసరమైన సూచనలను కూడా స్వీకరిస్తున్నారు.

ఒకవైపు రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ.. మరోవైపు ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే ద్విముఖ కార్యక్రమంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలను చేరుకుని, ప్రతి ఇంటి సమస్యను తెలుసుకునే దిశగా టీడీపీ శ్రేణులు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయనున్నాయి. దీంతో కూటమి పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీ శ్రేణులు వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story