Amaravati: సాలూరు ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!
Amaravati: సాలూరు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతిపై మంత్రి నారా లోకేష్ సంతాపం. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం.
Amaravati: సాలూరు ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!
Amaravati: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి అరుణ్ తేజ మృతి చెందిన ఘటనపై విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అరుణ్ తేజ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. చిన్న వయసులోనే విద్యార్థిని కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
పాఠశాల ప్రహరీ గోడ కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించారు. గోడ నిర్మాణం, దాని నాణ్యత, నిర్వహణలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా అనే అంశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఘటనకు కారణాలను పూర్తిస్థాయిలో వెలికితీసి, బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు, ఇతర మౌలిక వసతుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని నారా లోకేష్ స్పష్టం చేశారు.




