AP: హరితాంధ్ర లక్ష్యంలో నాగబాబు కీలక బాధ్యత...ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్!
AP: ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ, పునర్వనీకరణ లక్ష్యంగా 'ఏపీ గ్రీన్' (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కేబినెట్ హోదాతో నియమితులయ్యారు.
AP: హరితాంధ్ర లక్ష్యంలో నాగబాబు కీలక బాధ్యత...ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్!
AP: వికసిత్ ఆంధ్రప్రదేశ్–2047 లక్ష్యాల్లో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యం అత్యంత కీలకంగా మారింది. పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రభుత్వానికి సవాల్గా ఉంది. ఈ నేపథ్యంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, అడవుల పునరుద్ధరణ, పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, పచ్చదనం విస్తరణ వంటి కార్యక్రమాలకు AP GREEN కీలక వేదికగా నిలవనుంది.
నాగబాబుకు అప్పగించిన బాధ్యత కేవలం ఒక పదవి మాత్రమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్ పర్యావరణ విధానాలతో ముడిపడిన కీలక బాధ్యతగా భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం హరిత కవర్ పెంపు, మడ అడవుల విస్తరణ, తీర ప్రాంతాల్లో పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. వీటిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో AP GREEN కీలక పాత్ర పోషించనుంది.
ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వాములను చేస్తూ పునర్వనీకరణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా వాటి సంరక్షణ, మనుగడపై దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించగలమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్ను అందించాలనే లక్ష్యంతో నాగబాబు తన కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. నాగబాబును కేబినెట్ హోదాలో AP GREEN ఛైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మద్దతు ఇచ్చిన కూటమి పక్షాల నాయకులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యం ఇస్తూ హరితాంధ్ర నిర్మాణంలో AP GREEN కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.




