Puttaparthi: పుట్టపర్తి దాహార్తికి శాశ్వత పరిష్కారం
Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిస్కారం. బుక్కపట్నం వద్ద రూ.136.26 కోట్లతో తాగునీటి పథకానికి కలెక్టర్, ఎమ్మెల్యే భూమి పూజ.
Puttaparthi: పుట్టపర్తి దాహార్తికి శాశ్వత పరిష్కారం
Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు శాశ్వత తాగునీటి పథకం పనులకు సత్యసాయి కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే సింధూర రెడ్డి భూమి పూజ నిర్వహించారు.
కొత్తచెరువు సమీపంలోని బుక్కపట్నం చెరువు వద్ద ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) సహకారంతో, జిందాల్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో పుట్టపర్తి మున్సిపాలిటీకి మంజూరైన రూ.136.26 కోట్ల శాశ్వత సమగ్ర త్రాగునీటి పథకం పనులకు వారు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2055 నాటి జనాభా (సుమారు 2 లక్షలు) అవసరాలకు అనుగుణంగా 90 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారని, జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో 2028 మే నాటికి పనులు పూర్తవుతాయన్నారు. పుట్టపర్తిలోని 11,700 కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందుతుందన్నారు. బుక్కపట్నం చెరువు పరిసరాలు పాపికొండలను తలపిస్తున్నాయని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా చెత్త నుండి సేంద్రియ ఎరువుల తయారీ, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్ శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం రూ.1000 కోట్లు మంజూరు చేసింది. అలాగే చిత్రావతి నది కాలుష్య నివారణకు రూ.1.50 కోట్లతో ఎస్టీపీ (STP) పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రాజెక్టును,
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.136.26 కోట్లతో పునరుద్ధరించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. సత్యసాయి బాబా ఆశీస్సులతో నియోజకవర్గంలో పారిశ్రామిక విప్లవం రానుందని, ఆమడగూరు మండలంలో రూ.51,400 కోట్లతో రిలయన్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందన్నారు. అలాగే పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ కూడా ఏర్పాటు కానుండడం మన జిల్లాకు గర్వకారణం అన్నారు. వీటి ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ,పిహెచ్ డిఇ నరసింహ మూర్తి ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, జిందాల్ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




