Puttaparthi: పుట్టపర్తిలో హర్ ఘర్ తిరంగా వేడుకలు ప్రతిజ్ఞ చేసిన అధికారులు!

Puttaparthi: పుట్టపర్తిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. సత్యమ్మ ఆలయం నుండి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ, విద్యార్థులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 13 Aug 2026 1:01 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తిలో హర్ ఘర్ తిరంగా వేడుకలు ప్రతిజ్ఞ చేసిన అధికారులు!

Puttaparthi: దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సార్వభౌమత్వం పట్ల ప్రజల్లో స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

ర్యాలీలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ సువర్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫైరోజా బేగం , ఐసిడిఎస్ పిడి ప్రమీల, డిఆర్‌డిఎ పిడి నరసయ్య తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా సాగింది. చిన్నారులు, విద్యార్థులు చేతుల్లో జాతీయ పతాకాలను పట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీ మధ్యలో విద్యార్థులు, చిన్నారులు “వందే మాతరం”, “భారత్ మాతాకీ జై” వంటి దేశభక్తి నినాదాలతో పుట్టపర్తి ప్రధాన వీధులను మార్మోగించారు. వారి ఉత్సాహం, దేశభక్తి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ జాతీయ స్ఫూర్తిని నింపింది.

ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడంతో పాటు, జాతీయ జెండా పట్ల గౌరవం, జాతీయ ఐక్యత, దేశ సమగ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై జాతీయ పతాకాన్ని గౌరవంగా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.ర్యాలీ ముగిసిన అనంతరం పాల్గొన్న అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, చిన్నారులు మరియు ఇతరులు కలిసి “హర్ ఘర్ తిరంగా” ప్రతిజ్ఞను స్వీకరించారు.

జాతీయ పతాక గౌరవాన్ని కాపాడుతూ, దేశ ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమం ద్వారా “ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం – ప్రతి హృదయంలో దేశభక్తి” అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

అధికారులు, విద్యార్థులు, చిన్నారులు సమన్వయంతో నిర్వహించిన ఈ ర్యాలీ పుట్టపర్తిలో దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచింది.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story